
సెంట్ లూసియా: వెస్టిండీస్ పర్యటనలో భారత మహిళా జట్టు అద్భుత విజయాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను సొంతం చేసుకున్న హర్మన్ప్రీత్ సేన.. అదే జోరును టీ20ల్లో కూడా కొనసాగిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో హర్మన్ప్రీత్ సేన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలిచిన భారత మహిళలు సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించారు.
ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ను భారత బౌలర్ దీప్తి శర్మ గడగడలాడించింది. నాలుగు ఓవర్లలో కేవలం పది పరుగులిచ్చి కీలక నాలుగు వికెట్లు తీసింది. దీంతో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (23), చీడియాన్ నేషన్ (32)లు మినహా ఎవరూ రాణించలేదు. దీప్తి శర్మ నాలుగు వికెట్లు తీయగా.. శిఖా పాండే, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్లు తలో వికెట్ తీశారు.
లక్ష్య ఛేదనలో టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ షెఫాలి వర్మ (69; 35 బంతుల్లో 10x4, 2x6), స్మృతి మంధాన (30; 28 బంతుల్లో 4x4) ధాటిగా ఆడడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. విండీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వని షెఫాలి అర్ధ సెంచరీ చేసింది. తొలి టీ20లో మ్యాచ్లో షెఫాలి-మంధాన జోడీ వంద పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన విషయం తెలిసిందే. మూడో టీ20 నవంబర్ 14న జరగనుంది.
శనివారం జరిగిన తొలి టీ20లో భారత్ 84 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. షెఫాలీ వర్మ (73; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మృతీ మంధాన (67; 46 బంతుల్లో 11 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచులో షెఫాలీ టీ20లో తొలి అర్ధ శతకం చేసింది.
దీంతో భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లలో అర్ధ శతకం చేసిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డుల్లో ఎక్కింది. ఇక ప్రపంచ క్రికెట్లో ఈ రికార్డు సాధించిన రెండో బ్యాట్స్వుమన్గా నిలిచింది. షెఫాలీ కన్నా ముందు యూఏఈకి చెందిన ఎగొడాగ్ 15 ఏళ్ల 267 రోజుల్లో తొలి టీ20 అర్ధ శతకం బాదింది. షెఫాలి 15 ఏళ్ల 285 రోజుల్లో తొలి టీ20 అర్ధ శతకం చేసింది.