
మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు రెచ్చిపోయారు. ముంబై చేతిలో ఘోరంగా ఓడిన కసితో ఉన్న ఈ జట్టు.. గుజరాత్ జెయింట్స్పై విరుచుకుపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే ఈ నిర్ణయం ఆ టీంకు పెద్దగా కలిసి రాలేదు. ఢిల్లీ బౌలర్లు చెలరేగడంతో గుజరాత్ బ్యాటర్లు వణికిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా పోటీ ఇవ్వలేకపోయారు.
సౌతాఫ్రికా ఆల్రౌండర్ మారిజానే కాప్ ఈ మ్యాచ్లో చెలరేగింది. గుజరాత్ ఓపెనర్లు సబ్బినేని మేఘన (0), లారా వోల్వార్డ్ (1) ఇద్దరినీ పెవిలియన్ చేర్చింది. ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్ (20), జార్జియా వారెహమ్ (22), టిమ్ గార్త్ (32 నాటౌట్), తనూజా కన్వర్ (13) మాత్రమే ఫర్వాలేదనిపించారు.

మిగతా వాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. ఆష్లే గార్డనర్ డకౌట్ కాగా.. హేమలత (5), సుష్మా వర్మ (2), కెప్టెన్ స్నేహ్ రాణా (2), మాన్సి జోషి (5 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆలౌట్ ప్రమాదం తప్పించుకున్న గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా షెఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆమెకు కెప్టెన్ మెగ్ లానింగ్ (21 నాటౌట్) మంచి సహకారం అందించింది. వీళ్లిద్దరూ ఆరంభం నుంచే గుజరాత్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి మ్యాచ్ అయిపోతుందా? అని ప్రేక్షకులు అనుకున్నారు.

ఈ క్రమంలో కేవలం 7.1 ఓవర్లలోనే 109 పరుగులు చేసిన ఢిల్లీ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కేవలం 15 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్న మారిజానే కాప్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది.