
జొహన్నెస్బర్గ్: బయో సెక్యూర్ (జీవ రక్షణకు అనుకూలమైన వాతావరణం) వాతావరణం కల్పిస్తే మునుపటిలాగే క్రికెట్ ఆడొచ్చని దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం షాన్ పొలాక్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యేకంగా సృష్టించిన వాతావరణంలో బంతి షైనింగ్ కోసం ఉమ్మి (సలైవా), చెమటను వినియోగించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రెండు నెలలుగా క్రీడాలోకం స్తంభించిపోగా.. ఇప్పుడిప్పుడే తిరిగి టోర్నమెంట్లు ప్రారంభమయ్యేలా కనిపిస్తున్నాయి.
జులై 8 నుంచి వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు సోమవారం బయలుదేరనుంది. ఈ సిరీస్ను బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో నిర్వహించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంతి షైనింగ్ కోసం ఉమ్మి (సలైవా), చెమటను వినియోగించకూడదని ఇటీవల ఐసీసీ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో పొలాక్ స్పందించాడు.
'ప్రత్యేకంగా సృష్టించిన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది ఉండదనుకుంటున్నా. అది ఒక రక్షణ కవచంలా ఉపయోగపుడుతుంది. మ్యాచ్లకు ముందే స్వీయ నిర్బంధం పూర్తి చేసుకొని అంతా సురక్షితంగా ఉంటారు. వారు ఉంటున్న ప్రాంతాల్లోనూ నిరంతరం ద్రావణాల పిచికారి జరుగుతుంది. వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తితో కలవనప్పుడు ఇక భయపడాల్సిన పనిలేదు. ప్రేక్షకులను అనుమతించకపోవడం తప్ప ఆటలో పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇక అలాంటప్పుడు బంతి షైనింగ్ అనేది సమస్యే కాదు' అని పొలాక్ అన్నాడు. పొలాక్ దక్షిణాఫ్రికా తరఫున 108 టెస్టులు, 303 వన్డేలు, 12 టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టులలో 421, వన్డేల్లో 393, టీ20ల్లో 15 వికెట్లు తీసాడు. అలానే 3781, 3519, 86 పరుగులు చేసాడు.
క్రికెట్ బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు కృతిమ పదార్థాన్ని అనుమతించలేమని ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్, టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశారు. బ్యాటు, బంతి మధ్య సమతూకం కోసం పిచ్లను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. బంతిపై ఉమ్మి రుద్దకుండా ఆడాలంటే కాస్త సమయం పడుతుందన్నారు.
'క్రికెట్లో బౌలింగ్కు అనుకూలించే పిచ్లను రూపొందించి బంతి, బ్యాటుకు మధ్య సమతూకం తీసుకురావొచ్చు. పిచ్పై పచ్చికను ఉంచొచ్చు. సంప్రదాయ స్వింగ్, రివర్స్ స్వింగ్కు అనుకూలించకపోతే.. ఇద్దరు స్పిన్నర్లను ఆడించొచ్చు. వన్డే, టీ20ల గురించి ఎవరికీ ఎలాంటి ఆందోళన లేదు. టెస్టుల విషయంలో మాత్రమే ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్లపై ఇద్దరు స్పిన్నర్లతో ఆడించడం జరగదు. ఇప్పుడు ఇద్దరు స్పిన్నర్లను ఆడించొచ్చు' అని కుంబ్లే అన్నారు.