ఆస్ట్రేలియా క్రికెట్లో స్టార్ ప్లేయర్లు వరుసగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇటీవల వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. సొంతమైదానంలో సిడ్నీ వేదికగా పాకిస్థాన్తో వార్నర్ చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే దిగ్గజ క్రికెటర్లు ఆరోన్ ఫించ్, షాన్ మార్ష్ రెండు రోజుల వ్యవధిలోనే వరుసగా క్రికెట్కు గుడ్బై పలికారు.
బిగ్ బాష్ లీగ్లో ఫించ్, షాన్ మార్ష్ ఇద్దరూ మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన ఫించ్ తన ఆఖరి మ్యాచ్ను శనివారం ఆడేశాడు. అయితే మార్ష్ తన నిర్ణయాన్ని ఆదివారం వెల్లడించడం గమనార్హం. ప్రొఫెషనల్ క్రికెట్కు గుడ్ బై పలుకుతున్నట్లు మార్ష్ తెలిపాడు. బుధవారం సిడ్నీ థండర్తో జరిగే మ్యాచ్ తన కెరీర్లో ఆఖరిదిగా పేర్కొన్నాడు. ఈ సీజన్లో సిడ్నీ థండర్, మెల్బోర్న్ రెనెగేడ్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి.

40 ఏళ్ల షాన్ మార్ష్ 2019 నుంచి ఆస్ట్రేలియా జట్టుకు దూరమయ్యాడు. వార్నర్, స్మిత్ నిషేధానికి గురవ్వడంతో జట్టులో మార్ష్ కీలకపాత్ర పోషించాడు. అయితే 2019 ప్రపంచకప్లో గాయపడ్డ మార్ష్ తిరిగి ఆసీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కరోనాతో ఆటలకు అంతరాయం కలగడం అతడి కెరీర్పై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ తర్వాత లీగ్ క్రికెట్ ఆడుతున్న మార్ష్ గతేడాది మార్చిలో ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు క్రికెట్ మొత్తానికి వీడ్కోలు పలికాడు.
అయితే ఐపీఎల్లో షాన్ మార్ష్ సత్తాచాటాడు. తొలి సీజన్లో ఆరెంజ్ క్యాప్ను అందుకున్న ప్లేయర్గా మార్ష్ చరిత్రకెక్కాడు. పంజాబ్ తరపున 2008లో బరిలోకి దిగిన మార్ష్ 616 పరుగులు చేశాడు. కాగా, షాన్ మార్ష్ తమ్ముడు అయిన మిచెల్ మార్ష్ కూడా ఆస్ట్రేలియాలో స్టార్ ప్లేయర్గా ఎదిగాడు. షాన్ ఎడమచేతి వాటం బ్యాటర్ కాగా, మిచెల్ మార్ష్ రైట్ హ్యాండర్, ఆల్రౌండర్.