ముంబై: టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక విషయంలో భారత జట్టు మాజీ ఆటగాళ్లు సౌరభ్ గంగూలీ, రవిశాస్త్రిల మధ్య నెలకొన్న మాటల యుద్ధానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మన్ రాజీవ్ శుక్లా చెక్ పెట్టాలని సూచించారు. గురువారం ఆయన ట్విట్టర్లో దీనిపై స్పందించారు. టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక బీసీసీఐ తీసుకున్న నిర్ణయమని దానిని మీరిద్దరూ గౌరవించాలని సూచించారు.
భారత క్రికెట్కు సౌరభ్ గంగూలీ, రవిశాస్త్రి ఇద్దరూ ఎనలేని సేవలు చేశారని, తద్వారా వచ్చిన కీర్తిని ఆస్వాదించాలంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ సూచన మేరకు బీసీసీఐ... టీమిండియా హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లేని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ దిగ్గజాలు సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
అంతకముందు టీమిండియా డైరెక్టర్గా వ్యవహరించిన రవిశాస్త్రీనే టీమిండియా కోచ్ బాధ్యతలు చేపడతారని అంతా అనుకున్నప్పటికీ.. అనూహ్యంగా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కూంబ్లే తెరపైకి వచ్చి కోచ్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవిశాస్త్రిని ఆ పదవికి ఎంపిక చేయడంతో ఒకింత అసంతృప్తికి గురయ్యారు.

కోచ్ పదవికి మరో ప్రధాన పోటీదారు అయిన రవిశాస్త్రికి ఇంటర్వ్యూ జరిగే సమయంలో అసలక్కడ గంగూలీనే లేడని స్వయంగా రవిశాస్త్రినే వెల్లడించాడు. అంతేకాదు తాను ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో గంగూలీ బయటకు వెళ్లిపోయి తనను అగౌరవపరిచాడని రవిశాస్ర్తి విమర్శనాస్ర్తాలు సంధించాడు.
టీమిండియా డైరెక్టర్గా 18 నెలలు కష్టపడ్డానని, యువ జట్టుతో అనేక విజయాలు సాధించి పెట్టానని.. బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లోని ఒక సభ్యుడి కారణంగా టీమిండియా కోచ్ కాలేకపోయానని గంగూలీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీంతో రవిశాస్త్రి ఆరోపణలపై గంగూలీ కూడా తీవ్రంగానే స్పందించాడు.
రవిశాస్ర్తి పిచ్చోళ్ల ప్రపంచంలో బతుకుతున్నట్టుగా అనిపిస్తోందని ఘాటుగా విమర్శించాడు. 'ఒకవేళ తనకు కోచ్ పదవి దక్కకపోవడానికి నేనే కారణమని రవి భావిస్తే అది అతని పొరపాటు. నా వల్లే కోచ్ కాలేకపోయానని ఆయన ఊహించుకోవడం అంటే పిచ్చోళ్ల ప్రపంచంలో జీవిస్తున్నట్టే. సీఏసీలో నా కంటే ఎంతో పెద్ద వ్యక్తులు ఉన్నార'ని గంగూలీ బుధవారం మీడియాతో అన్నారు.
'నేను కొన్ని పత్రికల్లో రవి వ్యాఖ్యలు చదివా. ఇవి చాలా వ్యక్తిగతం అనుకుంటున్నా. వాటిపై స్పందించకూడదని తొలుత అనుకున్నా. కానీ ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం కోసం ఇలా బహిరంగంగా మాట్లాడడం నన్ను చాలా బాధించింది. గత 20 ఏళ్లుగా బోర్డులోని ప్రతి కమిటీలోనూ ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం భావ్యం కాదు. పదేళ్ల కిత్రం కోచ్ ఎంపిక ప్రక్రియలో అతను నా స్థానంలో ఉన్నాడు. అతనికి అన్ని విషయాలపై అవగాహన ఉంది. గౌరవం గురించి మాట్లాడే ముందు అతను కూడా గౌరవంగా ఉండాలి. బహిరంగంగా విమర్శలు చేసే ముందు రవి కొంచెం పరిణతితో వ్యవహరించాల్సింద'ని అభిప్రాయపడ్డాడు.
'ఇలాంటి సమావేశాల్లో ఉండాలని అతను నాకు సలహా ఇవ్వడం కోపం తెప్పిస్తోంది. కొంతకాలంగా బోర్డు భేటీల్లో నేను కూడా భాగస్వామిగా ఉంటున్నా. ఎప్పుడూ వారికి అందుబాటులోనే ఉంటున్నా. రవికి నా సలహా ఏంటంటే.. చాలా కీలక పదవి అయిన భారత కోచ్ను ఎంపిక చేస్తున్నప్పుడు కమిటీ ముందు కూర్చోవాలి. అంతేగాని బ్యాంకాక్లో విహారయాత్రలో ఉండి ప్రజెంటేషన్ ఇవ్వకూడద'ని పేర్కొన్నాడు.
ఇంటర్వ్యూ సమయంలో విహార యాత్రలో ఉన్న శాస్ర్తికి అసలు కోచ్ పదవిపై నిజంగానే ఆసక్తి ఉందా అని ప్రశ్నించాడు. హెడ్ కోచ్ ఇంటర్యూ రోజున ఏం జరిగిందంటే.. 'అదే రోజు క్యాబ్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉందని నేను బోర్డుకు ముందే చెప్పా. క్యాబ్ అధ్యక్షుడిగా నేను ఆ భేటీలో తప్పక పాల్గొనాలి. వర్కింగ్ కమిటీ సమావేశానికి ఎప్పుడూ 14 రోజులు ముందుగానే నోటిఫికేషన్ ఇస్తారు.
ఈ సమావేశం మాత్రం రెండు రోజుల ముందుగానే ఖరారైంది. రవి ఇంటర్వ్యూను సాయంత్రం 4.15 గంటలకు షెడ్యూల్ చేశారు. ఆ విషయం రవికి కూడా తెలుసనుకుంటా. బోర్డు అతనికి సమయం కూడా చెప్పింది. అయితే, మిగతా అభ్యర్థులతో మాట్లాడే సరికే సమయం ఐదు దాటింది. దీంతో నేను బయటకు వచ్చా.
అప్పుడు అజయ్ షిర్కే నాకు ఫోన్ చేసి మిగతా సభ్యులు ఇంటర్వ్యూ కొనసాగించాలని కోరుతున్నారని చెప్పారు. ఇలాంటి విషయాలు ప్రపంచంలో ప్రతిచోటా జరుగుతూనే ఉంటాయి, మీరు కానివ్వండని చెప్పా. ఇదీ జరిగిన విషయం. శాస్ర్తి వ్యాఖ్యలు మాత్రం చాలా వ్యక్తిగతంగా ఉన్నాయ'ని గంగూలీ తెలిపాడు.