IND vs PAK: ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించిన విషయం పెద్ద వివాదానికి దారితీసిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అయిన శశిథరూర్ దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'పాకిస్తాన్పై మనకు ఎంత బలమైన భావోద్వేగాలు ఉన్నప్పటికీ.. ఒకసారి ఆడాలని నిర్ణయించుకుంటే, దానిని క్రీడాస్ఫూర్తితో ఆడాలి" అని కార్గిల్ యుద్ధ సమయంలో జరిగిన మ్యాచ్ను ఉదాహరణగా శశి థరూర్ పేర్కొన్నారు.
భారత్, పాకిస్తాన్ జట్లు ఆసియా కప్ ఫైనల్లో మళ్లీ తలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ హ్యాండ్షేక్ వివాదం గురించి శశిథరూర్ మాట్లాడారు. రాజకీయాలు, సైనిక ఘర్షణలను ఆటతో కలపకూడదని ఆయన గట్టిగా చెప్పారు. "నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, పాకిస్తాన్పై మనకు అంత బలమైన భావాలు ఉంటే, మనం వారితో అసలు ఆడే ఉండకూడదు. కానీ ఒకసారి వారితో ఆడాలని నిర్ణయించుకున్న తర్వాత, మనం దానిని క్రీడా స్ఫూర్తితో ఆడాలి, వారితో కరచాలనం చేసి ఉండాలి." అని శశిథరూర్ అన్నారు.

"మనం గతంలో కూడా ఇలా చేశాం. 1999లో కార్గిల్ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ కప్లో మనం పాకిస్తాన్తో ఆడాం. మన సైనికులు సరిహద్దులో దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తున్న ఆ రోజుల్లో కూడా మనం పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేశాం. ఎందుకంటే క్రీడా స్ఫూర్తి అనేది దేశాలు, సైన్యాల మధ్య జరిగే విషయాల కంటే భిన్నమైంది. ఇది నా అభిప్రాయం." అని శశి థరూర్ వెల్లడించారు. అంతేకాకుండా భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల నుంచి వ్యక్తమైన ప్రతిస్పందనలు క్రీడా స్ఫూర్తి లేకపోవడాన్ని తెలియజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. "మొదటిసారి అవమానించబడిన పాకిస్తాన్ జట్టు రెండోసారి మనపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే, అది రెండు వైపులా క్రీడా స్ఫూర్తి లేదు అనడానికి నిదర్శనం" అని ఆయన అన్నారు.
వివాదం నేపథ్యం:
ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో తీవ్రవాద దాడిలో బాధితుల పట్ల గౌరవం ప్రకటించే విధంగా, పాకిస్తాన్తో జరిగిన రెండు మ్యాచ్లలో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో రెచ్చగొట్టే సైగలను ప్రదర్శించారు. పాక్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ తన హాఫ్ సెంచరీని "గన్ పేల్చినట్లు" సైగ చేస్తూ జరుపుకున్నాడు. పాక్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ భారత సైనిక చర్యను ఎగతాళి చేస్తూ "రఫేల్"ను కూల్చివేసినట్లు సైగ చేశాడు.
ఈ చర్యలకు గానూ బీసీసీఐ పాకిస్తాన్ ఆటగాళ్లపై ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీవ్రవాద దాడి గురించి మాట్లాడి ఆటలో రాజకీయాలు కలిపారని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కార్గిల్ యుద్ధ కాలాన్ని ఉదాహరణగా చూపిస్తూ శశి థరూర్ మాట్లాడారు.