
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో భారత జట్టు ఓటమి పాలైంది. దీనికి ప్రధాన కారణం మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్ ఫ్లాప్ షో అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కనీసం చివరి వన్డేలో అయినా సూర్య రాణించి ఉంటే ఈ సిరీస్ టీమిండియా కైవసం చేసుకునేదే. ఈ సిరీస్ తొలి రెండు వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్ను ఎదుర్కోలేక సూర్యకుమార్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఇక చివరి వన్డేలో స్పిన్నర్ ఆష్టన్ అగర్ వేసిన బంతిని అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
టీమిండియా వన్డే జట్టులో కీలకంగా మారిన శ్రేయాస్ అయ్యర్.. వెన్నునొప్పితో జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానాన్ని సూర్యకుమార్తో భర్తీ చేయాలని టీమిండియా భావించింది. ఈ క్రమంలో వన్డేల్లో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను టీం మేనేజ్మెంట్ పక్కనపెట్టింది. టీ20 ఫామ్ ఆధారంగా సూర్యకుమార్ యాదవ్కు అవకాశం ఇచ్చింది. అయితే ఈ ప్లాన్ సరిగా పనిచేయలేదు. ఇటీవలి కాలంలో సూర్య ఆడిన ఒక్క వన్డేలో కూడా అతను పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇక ఆసీస్తో వన్డే సిరీస్లో సూర్య ఘోరంగా విఫలమై.. వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డక్లుగా అవుటైన ఆటగాడిగా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ నేపథ్యంలో కేరళ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ మూడు గోల్డెన్ డక్స్తో చెత్త రికార్డు సాధించాడు. అలాంటప్పుడు తనకు అనుభవం లేని 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కూడా 66 సగటుతో బ్యాటింగ్ చేస్తున్న సంజూ శాంసన్కు ఎందుకు అవకాశం ఇవ్వలేదో అడగడం తప్పా? జట్టులో చోటు కోసం అతను అసలు ఏం చెయ్యాలి?' అని థరూర్ ట్వీట్ చేశాడు. చాలా మంది అభిమానులు కూడా ఇదే ప్రశ్నను సంధించారు.