
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ వైదొలిగారు. రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తన బాధ్యతల నుంచి శశాంక్ తప్పుకొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఐసీసీ బుధవారం వెల్లడించింది. చైర్మన్ పదవికి మరొకరు ఎన్నికయ్యే వరకు ఆ బాధ్యతలను డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖజా నిర్వహిస్తారని ఐసీసీ వెల్లడించింది. వారం రోజుల్లో కొత్త ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఆరంభమవుతుందని సమాచారం.
ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో శశాంక్ మనోహర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్నీ మాట్లాడుతూ... 'ఐసీసీ బోర్డు, సిబ్బంది, మొత్తం క్రికెట్ కుటుంబం తరఫున శశాంక్ మనోహర్కు కృతజ్ఞతలు. ఐసీసీ ఛైర్మన్గా ఆయన క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆయన నాయకత్వానికి అభినందనలు' అని అన్నారు. మనోహర్, ఆయన కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా సైతం శశాంక్ మనోహర్పై ప్రశంసలు కురిపించారు. 'మనోహర్ అంకితభావానికి ఐసీసీలో అందరూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆయన చేసిన దానికి క్రికెట్ రుణపడి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. ఆయన తన శక్తికి మించి క్రికెట్, ఐసీసీని మెరుగైన స్థానంలో ఉంచారు' అని ఇమ్రాన్ ఖాజా కొనియాడారు. చైర్మన్గా శశాంక్ ఎన్నికైన నాటి నుంచి బీసీసీఐకి ఐసీసీతో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అతడు పదవిలో ఉన్నంత కాలం బీసీసీఐకి నష్టమే కానీ లాభం జరగలేదని బోర్డు సభ్యులు అనుకుంటున్నారు.
వారం రోజుల్లోగా శశాంక్ మనోహర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐసీసీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈసీబీ మాజీ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పోటీలో ఉన్నారు.అయితే కోలిన్ గ్రేవ్స్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏవరైనా సరే ఏకగ్రీవం కోసమే ప్రయత్నించే అవకాశముంది. ఇప్పటికైతే గంగూలీ అభ్యర్థిత్వం గురించి బీసీసీఐ ఎక్కడా చెప్పలేదు. అనూహ్య పరిణామాలు జరిగితే గంగూలీ ఐసీసీ ఛైర్మన్ పదవిలో ఉండడం ఖాయం.