
సౌతాఫ్రికాతో జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీసిన తర్వాత టీమిండియా పేసర్ లార్డ్ శార్దూల్ ఠాకూర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతుంది. లార్డ్ శార్దూల్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ తనకు లార్డ్ అనే పేరు ఎలా వచ్చిందో వివరించాడు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ముగించుకుని ఇండియాకు వచ్చాక ఐపీఎల్కు ముందు ఇంగ్లండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడామని గుర్తు చేశాడు.
ఆ సిరీస్లో తాను బాగా ఆడానని, ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీశానని అన్నాడు. అప్పటి నుంచే తన పేరు లార్డ్ శార్దూల్ అని సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిందని చెప్పాడు. అయితే ఆ పేరు ఎవరు పెట్టారో మాత్రం కచ్చితంగా తెలియదని తెలిపాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా తాను చాలా వికెట్లు తీశానని చెప్పాడు.
కాగా సెకండ్ టెస్టు మ్యాచ్లోని తొలి ఇన్నింగ్స్లో లార్డ్ శార్దూల్ ఠాకూర్ 7 వికెట్లతో చెలరేగడంపట్ల భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించారు. "నీ వైవిధ్యమైన బౌలింగ్తో 7 వికెట్లు తీశావు అభినందనలు" అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. అయితే సచిన్ ట్వీట్ చేయడం పట్ల శార్దూల్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశాడు. స్వయంగా క్రికెట్ దేవుడే తన గురించి ట్వీట్ చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు. సచిన్ చేసిన ట్వీట్ తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని గుర్తు చేసుకున్నాడు.
అలాగే తాను కూడా ముంబై ఆటగాడినే అని తెలిపాడు. అంతేకాకుండా ముంబై జట్టు తరఫున సచిన్తో కలిసి తాను బరిలోకి దిగిన విషయాన్ని ఈ సందర్భంగా ఠాకూర్ గుర్తు చేసుకున్నాడు. ఆ రోజుల్లో సచిన్ తనకెప్పుడు మద్దతుగా నిలిచేవాడని శార్దూల్ తెలిపాడు. అలాగే కెరీర్లో తన విజయ రహస్యాన్ని కూడా చెప్పాడు. తాను ఎప్పుడూ గ్రౌండ్లోకి పూర్తి ఆత్మవిశ్వాసంతో అడుగుపెడాతానని, అదే తన విజయం రహస్యం అనుకుంటున్నట్లు వివరించాడు. గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతానని, భవిష్యత్లో కూడా ఇదే కొనసాగిస్తానని లార్డ్ శార్దూల్ ఠాకూర్ చెప్పాడు.