ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోనీ స్టార్ ఆటగాళ్లలో శార్దూల్ ఠాకూర్ ఒకరు. కనీస ధర రూ.2 కోట్లతో వచ్చిన ఈ స్టార్ ఆల్రౌండర్ కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అతని మాజీ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కూడా బిడ్ వేయలేదు. గతేడాది డిసెంబర్లో చివరిగా భారత్కు ప్రాతినిథ్యం వహించిన శార్దూల్కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. అతను వేలంలో కొనుగోలు కాకపోవడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేసింది.
కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శార్దూల్ ఠాకూర్ ప్రదర్శనను చూసిన అనంతరం అభిమానులు తమ మనస్సు మార్చుకున్నారు. ఫ్రాంచైజీల వ్యూహాలు సరైనవిగా అభివర్ణిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే... దేశవాళీ ధనాధన్ టోర్నీలో చెత్త బౌలర్గా శార్దూల్ అపకీర్తి మూటగట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ రమేశ్ రాహుల్ సరసన రికార్డులకెక్కాడు. కేరళతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఈ కోరుకోని ఘనత సాధించాడు.

నాలుగు ఓవర్లు వేసిన శార్దూల్ ఠాకూర్ ఏకంగా 17.25 ఎకానమీ రేటుతో 69 పరుగులు సమర్పించుకున్నాడు. సంజు శాంసన్ వికెట్ తీసినప్పటికీ శార్దూల్కు ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మెగాటోర్నీలో కొన్నిరోజుల ముందు రమేశ్ రాహుల్ కూడా 69 పరుగులు ఇచ్చాడు. కాగా, అంతకుముందు ఈ రికార్డు హైదరాబాద్ బౌలర్ పగడాల నాయుడు (1/67) పేరిట ఉండేది. 2010లో ముంబైతో జరిగిన మ్యాచ్లో నాయుడు 67 పరుగులు ఇచ్చాడు.
కాగా, కేరళతో జరిగిన మ్యాచ్లో ముంబై 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కేరళ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 234 పరుగులు చేసింది. సల్మాన్ నిజార్ (99 నాటౌట్; 49 బంతుల్లో, 5 ఫోర్లు, 8 సిక్సర్లు), రోహన్ (87; 48 బంతుల్లో, 5 ఫోర్లు, 7 సిక్సర్లు) సత్తాచాటారు. మోహిత్ (4/44) నాలుగు, శార్దూల్ (1/69) ఒక వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో ముంబై 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. అజింక్య రహానె (68; 35 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడాడు.