
గాయాల కారణంగా ఈ ఏడాది జరిగే ఐపీఎల్కు కొంత మంది స్టార్ ఆటగాళ్లు దూరం అయ్యారు. దీంతో ఆయా జట్లు కెప్టెన్లను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది చివర్లో యాక్సిడెంట్కు గురైన రిషభ్ పంత్ ఇప్పటికే ఈ లీగ్కు దూరమయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతని స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు పగ్గాలు అందించింది. అలాగే అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్ చేసినట్లు ప్రకటించింది.
ఇలాంటి సమయంలో డీసీ మాజీ సారధి, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఐపీఎల్కు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. వెన్నునొప్పితో బాధ పడుతున్న అతనికి శస్త్రచికిత్స చేయించాలని వైద్యులు సూచించారు. దీంతో అతను కనుక సర్జరీ చేయించుకుంటే ఐపీఎల్తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు కూడా దూరం అవడం ఖాయం. గట్టిగా మాట్లాడితే ఆ తర్వాత జరిగే ఆసియా కప్, ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో కూడా అయ్యర్ ఆడటం కష్టంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో తమ జట్టు కెప్టెన్గా ఎవర్ని నియమించాలని కోల్కతా నైట్ రైడర్స్ తలపట్టుకుంటోంది. డీసీలో వార్నర్ ఉండటంతో.. పంత్ స్థానంలో అతన్ని కెప్టెన్ చేశారు. కానీ అలా రెడీమేడ్ ఆప్షన్ కేకేఆర్ వద్ద లేదు. దీంతో కొంత మందేమో టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. కానీ ఏమాత్రం కెప్టెన్సీ అనుభవం లేని ఠాకూర్కు జట్టు పగ్గాలు ఇవ్వడం అంటే పెద్ద ప్రయోగం చేసినట్లే అని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోంది.
ఇప్పుడు కేకేఆర్ వద్ద మరో రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ విండీస్ స్టార్లే కావడం గమనార్హం. ఒకరేమో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ కాగా, మరొకరు విండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్. వీరిద్దరిలో ఒకరిని జట్టు కెప్టెన్ చేస్తే అభిమానులు కూడా సంతోషిస్తారని కేకేఆర్ భావిస్తోందట.
కాకపోతే వీరిలో ఎవరికి పగ్గాలు అందించాలనేది తలనొప్పిగా మారింది. లేదంటే ఎవరైనా భారత ఆటగాడినే కెప్టెన్ చేస్తే మంచిదా? అని కూడా ఆలోచనలు చేస్తోందట కేకేఆర్. ఏదేమైనా అయ్యర్ గాయం ఆ జట్టుకు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టిందనే చెప్పాలి.