
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టులో టీమిండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో శార్దుల్ ఠాకుర్ను తీసుకోవాలని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. రెండో టెస్టు (బాక్సింగ్ డే)లో ఉమేశ్కు కాలిపిక్క గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అతడు మిగతా సిరీస్కు దూరమయ్యాడు. మూడో టెస్ట్ ఆడకున్నా చివరి టెస్ట్కు అందుబాటులో ఉంటాడని ప్రచారం జరిగినా.. గాయం తీవ్రత, భవిష్యత్తు సిరీస్ల దృష్ట్యా టీమ్ మేనేజ్మెంట్ అతన్ని భారత్కు పంపించనుంది. భారత్కు తిరిగి వెళ్లి ఎన్సీఏలో చేరే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి చెప్పారు.
గాయం కారణంగా చివరి రెండు టెస్టులకు దూరమైన పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానం కోసం టీ నటరాజన్, శార్దుల్ ఠాకూర్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. అయితే నటరాజన్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో తగినంత అనుభవం లేకపోవడంతో శార్దుల్ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. శార్దుల్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గుచూపుతోందని తెలిసింది. నటరాజన్ తమిళనాడు తరఫున ఒకే ఒక్క ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడాడని, శార్దుల్ ముంబై తరఫున 62 మ్యాచ్లు ఆడి 206 వికెట్లు తీశాడని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
ఇంతకుముందే శార్దుల్ ఠాకూర్ వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ఎంపికైనా.. గాయం కారణంగా అరంగేట్రం చేయలేకపోయిన సంగతిని ఆ బీసీసీఐ అధికారి గుర్తుచేశారు. శార్దుల్ బ్యాటింగ్లోనూ రాణించగలడని, ఫస్ట్క్లాస్ క్రికెట్లో 6 అర్ధశతకాలు కూడా చేశాడని అతను పేర్కొన్నారు. దీంతో నటరాజన్ను కాదని, అతడిని ఎంపిక చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నవదీప్ సైనీ జట్టులో ఉన్నప్పటికీ అతని గురించి పెద్దగా చర్చ జరగడం లేదు.
ఏదేమైనా టీమిండియా సిడ్నీ చేరుకున్నాకే శార్దుల్ను మూడో టెస్టుకు ఎంపిక చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారని బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ విషయంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి, తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కొన్ని ప్రాక్టీస్ సెషన్ల తర్వాత బౌలర్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని సిడ్నీ టెస్టు కోసం తుది జట్టు ఎంపికపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.