శార్దూల్తో కేక్ను కట్ చేయించిన ధోనీ:
ఫైనల్ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు అందరూ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ దగ్గరుండి శార్దూల్తో కేక్ను కట్ చేయించాడు. దీంతో జట్టు సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పాటలు పాడారు. కొందరు ప్లేయర్స్ ఠాకూర్పై డ్రింక్ పోశారు. శార్దూల్కు ధోనీ కేక్ తినిపించాడు. ఇదంతా అక్కడి చెన్నై సిబ్బంది వీడియో తీశారు. వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 'గో శార్దూల్ .. ఇది మీ పుట్టిన రోజు' అని కాప్షన్ పెట్టింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు:
ఫైనల్ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో శార్దూల్ ఠాకూర్ కీలకపాత్ర పోషించాడు. చెన్నై నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభ్మన్ గిల్ (51) శుభారంభం చేశారు. ధాటిగా ఆడుతూ చెన్నైని భయపెట్టారు. బౌండరీలు బాదుతూ కోల్కతా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో 10 ఓవర్లలోనే తొలి వికెట్కు 91 పరుగులు జోడించి జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. ఇక కోల్కతా విజయం లాంఛనమే అనుకున్నారు అందరూ. ఈ క్రమంలోనే శార్దూల్ ఠాకూర్ మాయ చేశాడు. 11వ ఓవర్ బౌలింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీశాడు. దీంతో ఒక్కసారిగా చెన్నై పోటీలోకి వచ్చింది. తొలుత 11వ ఓవర్ నాలుగో బంతికి వెంకటేశ్ను పెవిలియన్కు పంపాడు. తర్వాత ఆరో బంతికి నితీశ్ రాణా (0)ను డకౌట్ చేశాడు.
జీవితంలో ఎప్పటికి మర్చిపోడు:
ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడడంతో కోల్కతా 93 పరుగులకు రెండు కీలక వికెట్లను కోల్పోయింది. అనంతరం 16వ ఓవర్లోనూ శార్దూల్ ఠాకూర్ మరోసారి మెరిశాడు. మిడిల్ ఆర్డర్లో కోల్కతాకు వెన్నెముకలా ఉండే రాహుల్ త్రిపాఠి (2)ని సైతం వెనక్కి పంపి కోల్కతాకు గెలుపు ఆశల్ని దూరం చేశాడు. అప్పటికి కేకేఆర్ జట్టు స్కోర్ 123/7గా నమోదైంది. ఇక చివర్లో లూకి ఫెర్గూసన్ (18), శివమ్ మావి (20) ధాటిగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. కోల్కతా జట్టు 20 ఓవర్లలో 165/9 స్కోర్తో సరిపెట్టుకుంది. చెన్నై ఓడే మ్యాచును గెలిపించినందుకు ఆ జట్టు ప్లేయర్స్ శార్దూల్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను 'లార్డ్' శార్దూల్ జీవితంలో ఎప్పటికి మర్చిపోడు.
16 మ్యాచ్ల్లో 21 వికెట్లు:
ఫైనల్ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2021లో బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ.. శార్దూల్ బౌలింగ్లో మాత్రం రాణించాడు. 16 మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చక్కటి ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. దాంతో శార్దూల్కు యూఏఈ, ఒమన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ పాల్గొనబోయే భారత జట్టులో స్థానం లభించింది. అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా తెలిపింది.


Click it and Unblock the Notifications












