
హైదరాబాద్: ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ఘనంగా ముగించిన విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలోనూ ఇంగ్లీష్ జట్టుపై కోహ్లీసేన ఆధిపత్యం చెలాయించింది. టెస్ట్ సిరీస్ను 3-1తో, టీ20 సిరీస్ను 3-2తో మరియు వన్డే సిరీస్ 2-1తో భారత్ గెలుచుకుంది. పరిమిత ఓవర్ల సిరీస్లో టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా మూడు వన్డేలు కలిపి 7 వికెట్లతో టీమిండియా తరపున లీడింగ్ వికెట్టేకర్గా నిలిచాడు. మూడో వన్డేలో మొదట బ్యాటింగ్లో 21 బంతుల్లో 30 పరుగులు.. ఆ తర్వాత బౌలింగ్లో 4 వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అయితే మూడో వన్డేలో శార్దూల్ ఠాకూర్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఓవర్లో శార్దూల్ వేసిన బంతి అతనిపై మీమ్స్ వచ్చేలా చేశాయి. బంతిని వేసే క్రమంలో శార్దూల్ అన్ని వేళ్లు కిందకు వంచి.. మధ్య వేలును మాత్రం పైకి చూపుతూ బంతిని విసిరాడు. సాధారణంగా మధ్య వేలు చూపిస్తే.. చాలా మందిలో డబుల్ మీనింగ్ డైలాగులు బయటికి వస్తుంటాయి. దేశముదురు సినిమాలో హీరోయిన్ హన్సిక మిడిల్ ఫింగర్ చూపెట్టినప్పటినుంచి చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు శార్దూల్ను ట్రోల్ చేయడానికి అదే కారణమైంది. అతనిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వచ్చాయి.
శార్దూల్ ఠాకూర్ అలా బౌలింగ్ చేసినప్పటినుంచి నెటిజన్లు అతనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'శార్దూల్.. ఆ వేలు ఎవరికి చూపిస్తున్నావ్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'నకల్ బంతి లాగా.. శార్దూల్ ఫకల్ బంతిని కనిపెట్టాడు అనుకుంటా?' అని మరొకరు ట్వీట్ చేశారు. 'శార్దూల్ ఆ వేలిని తనను అసహ్యించుకునేవాళ్లకు చూపిస్తున్నాడు', 'ఏంటి శార్దూల్ ఈ పని', 'ఒక బ్యాట్స్మన్కు ఆ వేలు ఎలా చూపించగలవు' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మూడో వన్డే శార్ధూల్ ఠాకూర్ 67 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మలుపు తిప్పిన ఘనత కూడా ఠాకూర్కే దక్కుతుంది. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచును భారత్ చేతిలోకి తీసుకొచ్చాడు. రెండో వన్డేలో తేలిపోయినా.. మొదటి మ్యాచులో అద్భుతంగా రాణించి ఆకట్టుకున్నాడు. సిరీస్లో ఠాకూర్ 7 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అయినా కూడా ఠాకూర్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కలేదు. ఈ విషయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ పెదవి విరిచాడు. ఇక శార్ధూల్ ఐపీఎల్ 2021 కోసం సిద్దమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున శార్ధూల్ ఆడుతున్నాడు.