
హైదరాబాద్: హార్దిక్ పాండ్యా... టీమిండియాకు ఆల్రౌండర్గా మొట్టమొదటి ఛాయిస్. అయితే భువీ పెళ్లి నేపథ్యంలో శ్రీలంకతో జరిగే చివరి రెండు టెస్టులకు అతడి స్థానంలో తమిళనాడుకు చెందిన ఆటగాడు విజయ్ శంకర్కు చోటు కల్పించారు సెలక్టర్లు.
రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పాండ్యా మాదిరి ఆల్ రౌండర్గా రాణిస్తున్న విజయ శంకర్ విదేశీ పర్యటనల్లో బ్యాకప్ ఆల్రౌండర్గా ఉంటాడని కోహ్లీ అన్నాడు.
'విజయ్ శంకర్ నిలకడగా ప్రదర్శనలు చేస్తూ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. మీడియం పేస్తో బౌలింగ్, చక్కటి బ్యాటింగ్ చేయగల మరో ఆల్రౌండర్ను దృష్టిలో ఉంచుకొని అతడిని ఎంపిక చేశాం. హార్దిక్ పాండ్యకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నా' అని కోహ్లీ అన్నాడు.
'విదేశీ పర్యటనల్లో మేం బ్యాకప్ గురించి యోచిస్తున్నాం. భారత జట్టుకు అలవాటు పడేందుకు అతడిని ఇక్కడికి తీసుకొచ్చాం. అతను తన ఆటపై బాగా దృష్టి సారించాల్సి ఉంది. ఐపీఎల్లో కూడా అతడి ఆటను చూశాం. మంచి ఫీల్డర్. ఐదో బౌలర్గా రోజుకు 10-12 ఓవర్లు సులభంగా వేయగలడు' అని కోహ్లీ అన్నాడు.

'సమతూకం ఉన్న క్రికెటర్. నేను నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూసిన దాని ప్రకారం అతను దృఢమైన బ్యాట్స్మన్. అతడి జీవితంలో ఇదొక గొప్ప అవకాశం' అని కోహ్లీ అన్నాడు. కాగా, మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు నాగ్ పూర్ వేదికగా శుక్రవారం ప్రారంభం కానుంది.