రిటైర్మెంట్ ధోనీ వ్యక్తిగత నిర్ణయం:
విమర్శల నేపథ్యంలో చెన్నై జట్టు సభ్యుడు షేన్ వాట్సన్ ధోనీకి అండగా నిలిచాడు. తాజాగా వాట్సన్ మాట్లాడుతూ... 'ధోనీ ఇప్పటికీ మంచి ఫామ్లోనే ఉన్నాడు. వికెట్ల వెనకాల అద్భుతాలు చేస్తున్నాడు. కీపింగ్లో ఇప్పటికి అతడే బెస్ట్. బ్యాటుతోనూ రాణిస్తున్నాడు. కానీ.. రిటైర్మెంట్ ధోనీ వ్యక్తిగత నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే తీసుకుంటాడు. ధోనీ ఎందరో యువకులకు స్ఫూర్తి. అతనిలా క్రికెట్ ఆడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు' అని అన్నాడు.
భారత్ విజయపరంపర కొనసాగించగలదు:
'కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ పరుగులు చేస్తూ అదరగొడుతున్నాడు. ఎప్పటికప్పుడు భారీ స్కోరులు సాధిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. అన్ని విధాలా ముందుండి జట్టును నడపిస్తున్నాడు. గతంలో స్టీవ్వా, రికీ పాంటింగ్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జైతయాత్ర కొనసాగించిన మాదిరిగానే.. ప్రస్తుతం భారత్ విజయపరంపర కొనసాగించగలదు' అని వాట్సన్ ధీమా వ్యక్తం చేసాడు.
భారత జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు:
'ప్రస్తుతం భారత జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. భారీ ఇన్నింగ్స్లు ఆడే రోహిత్ శర్మ, నిలకడగా ఆడే కోహ్లీ, యువ ఆటగాళ్లు, బంతితో చెలరేగే బౌలర్లు జట్టులో ఉన్నారు. స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా భారత జట్టు జైత్రయాత్ర కొనసాగించగలదు. ఆస్ట్రేలియా జట్టు కూడా ఎంతో బలంగా ఉంది. యాషెష్-2019లో స్టీవ్ స్మిత్ అద్భుతంగా రాణించాడు' అని వాట్సన్ పేర్కొన్నాడు.
క్రికెట్కు విరామం:
ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్లో స్లో బ్యాటింగ్ కారణంగా.. ధోనీపై విమర్శలు ఎక్కువయ్యాయి. కొంతమంది మాజీలు క్రికెట్కు వీడ్కోలు పలికే సమయం వచ్చిందని బాహాటంగానే అన్నారు. ఇవేమీ పట్టించుకోని ధోనీ.. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలల పాటు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో విండీస్, సౌతాఫ్రికా పర్యటనల నుండి స్వయంగా తప్పుకున్నాడు.