
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన చివరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్.. తన జట్టు ప్రవర్తనను ఖండించాడు. చివరి ఓవర్లో ఓబెడ్ మెక్కాయ్ వేసిన మూడో బంతిని నోబాల్గా ప్రకటించాలని ఢిల్లీ టీం నోబాల్ సిగ్నల్ చూపిస్తూ అరిచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అంపైర్ నితిన్ మీనన్.. ఢిల్లీ టీం విన్నపాన్ని తోసి పుచ్చి అది ఫెయిర్ డెలివరీ అని ప్రకటించాడు.
దీంతో కెప్టెన్ రిషబ్ పంత్, కోచ్ ప్రవీణ్ ఆమ్రే, డగౌట్లో ఉన్న ప్లేయర్లు, సహాయక సిబ్బంది అందరూ థర్డ్ అంపైర్కు అప్పీల్ చేయడంటూ ఆన్ ఫీల్డ్ అంపైర్పై అరిచారు. అయితే దాన్ని అంపైర్ నితిన్ కుమార్ పట్టించుకోకపోవడంతో పంత్.. తమ ప్లేయర్లను బ్యాటింగ్ చేయకండి వచ్చేయండంటూ పిలవడం, కోచ్ ఆమ్రే గ్రౌండ్లోకి వెళ్లి అంపైర్లతో వాదించడం జరిగాయి. ఈ ఘటన వివాదాస్పదమైంది. దీనిపై ఆట ముగిశాక.. డీసీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ స్పందించాడు.
చివరి ఓవర్లో జరిగిన ఘటన మమ్మల్ని బాగా నిరుత్సాహపరిచింది. జరిగిన దాంట్లో మా ఫ్రాంచైజీ తప్పేం లేదు. జరిగిన దానికి ఫ్రాంచైజీ బాధ్యత వహించదు. ముమ్మాటికి అది టీం ప్లేయర్లు, సిబ్బంది చేసిన తప్పిదమని పేర్కొన్నాడు. సిచువేషన్ ఎలాంటిదైనా ఆటగాళ్లు అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందేనని తెలిపాడు. అది రైట్ అయినా రాంగ్ అయినా అంపైర్దే తుదినిర్ణయమని పేర్కొన్నాడు. ఎవరైన సరే.. మ్యాచ్ జరుగుతుండగా.. గ్రౌండ్లోకి వెళ్లడం ఆమోదయోగ్యం కాదని తెలిపాడు.
అలాగే ఈ మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. నోబాల్ వివాదం వల్ల జరిగిన తాత్కాలిక బ్రేక్ వల్ల మ్యాచ్ మూమెంటమ్ దెబ్బతిందన్నాడు. అప్పటికీ 3సిక్సర్లతో మూమెంటమ్ అందుకున్న పావెల్.. ఆట కాసేపు ఆగిపోవడంతో ఆ మూమెంటమ్ కోల్పోయినట్లు భావిస్తున్నానన్నాడు. అలాగే రాజస్థాన్ బౌలర్ మెక్కాయ్ కూడా పూర్తి లయ తప్పిన టైంలో.. బ్రేక్ రావడంతో మళ్లీ తన లయను పుంజుకున్నాడు. ఫలితంగా మ్యాచ్పై పట్టు మా నుంచి రాజస్థాన్ చేతిలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఆవేశంతో ఊగిపోతున్న ఢిల్లీ కెప్టెన్ పంత్ను షేన్ వాట్సన్ శాంతపరిచి.. మ్యాచ్ చివరి దాకా జరిగేలా చూసిన సంగతి తెలిసిందే.