లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను ఆ ఫ్రాంజైజీ యజమాని సంజీవ్ గోయెంకా దారుణంగా అవమానించిన విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఓటమి అనంతరం మైదానంలోనే రాహుల్పై సంజీవ్ విరుచుకుపడ్డాడు. రాహుల్తో ఆవేశంగా మాట్లాడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం మౌనంగా నిలబడిపోయాడు.
జట్టు సారథి కేఎల్ రాహుల్పై కనీస మర్యాద లేకుండా బహిరంగంగానే లక్నో ఫ్రాంచైజీ యజమాని ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాశంగా మారింది. రాహుల్కు మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఈ సంఘటన తర్వాత లక్నో జట్టులో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సీజన్ ముగిసిన తర్వాత రాహుల్ను లక్నో ఫ్రాంచైజీ వదిలిపెట్టనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాహుల్ కూడా మెగా వేలంలోకి రావాలని చూస్తున్నాడని తెలుస్తోంది.

అయితే కేఎల్ రాహుల్కు జరిగిన ఈ సంఘటనపై టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమి స్పందించాడు. లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకాపై మండిపడ్డాడు. ఓ స్టార్ క్రికెటర్ను మైదానంలో అవమానించడం సిగ్గుమాలిన పని అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు యజమానిగా గౌరవప్రదమైన స్థానంలో ఉండి సంజీవ్ ఇలా చేయకూడదని షమి పేర్కొన్నాడు.
''ఆటగాళ్లకు గౌరవం ఉంటుంది. జట్టు యజమానిగా మీరు గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. ఎంతో మంది ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, మీ నుంచి నేర్చుకుంటున్నారు. కెమెరాల ముందు ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటు. దీనికి మీరు సిగ్గుపడాలి. ఈ పనిని మీరు భిన్నంగా కూడా చేయవచ్చు. డ్రెస్సింగ్ రూమ్, హోటల్లో మాట్లాడవచ్చు. మైదానంలో ఇలా చేయాల్సిన అవసరం లేదు''
''కేఎల్ రాహుల్ కెప్టెన్. అతడు సాధారణ ఆటగాడు కాదు. అంతేగాక క్రికెట్ అనేది టీమ్ గేమ్. ప్రణాళికలు అమలుకాకపోతే, అది పెద్ద విషయం కాదు. ఆటలో ఏదైనా జరగవచ్చు. మంచి, చెడు రోజులు ఉంటాయని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రతి ఆటగాడికి గౌరవం ఉంటుంది. వాళ్లతో మాట్లాడానికి ఓ మార్గం ఉంటుంది. ఈ సంఘటన చాలా పెద్ద తప్పు'' అని షమి పేర్కొన్నాడు.