మాంఛెస్టర్: ప్రపంచకప్ టోర్నమెంట్లో మరో భారీ విజయం టీమిండియా ఖాతాలో జమ చేరింది. వెస్టిండీస్ క్రికెట్ జట్టుపై 125 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమితో వెస్టిండీస్ ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ మెగా టోర్నమెంట్ నుంచి వైదొలగిన మూడో జట్టు ఇదే. ఇప్పటికే- ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ జట్టుకు వరుసగా ఇది ఆరో గెలుపు. వర్షం కారణంగా రద్దయిన న్యూజీలాండ్తో జరగాల్సిన మ్యాచ్ను పక్కన పెడితే.. ఈ టోర్నమెంట్లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది కోహ్లీ సేన.
టీమిండియా సాధించిన ఈ విజయంలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు. 6.2 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు. క్రిస్ గేల్, షై హోప్, షిమ్రోన్ హెట్మెయిర్, ఒషాన్నె థామస్ వికెట్లను తీసుకున్నాడు. ఇదో రికార్డుగా చెప్పుకోవచ్చు. ప్రపంచకప్ టోర్నమెంట్లో వెస్టిండీస్పై నాలుగు వికెట్లను సాధించిన రికార్డును సృష్టించాడు మహమ్మద్ షమీ. ఇప్పటిదాకా టీమిండియా తరఫున ఏ బౌలర్ కూడా నాలుగు వికెట్లను తీసుకోలేదు.
క్రిస్గేల్ మెరుపు ఫీల్డింగ్కు ఫ్యాన్స్ ఫిదా!
1983 ప్రపంచకప్ టోర్నమెంట్లో మీడియం పేసర్ మొహిందర్ అమర్నాథ్, ఆఫ్ స్పిన్నర్ రవిశాస్త్రి, 2011 ప్రపంచకప్లో ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్లవే ఇప్పటిదాకా అత్యుత్తమ గణాంకాలుగా ఉండేవి. 1983 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో మొహిందర్ అమర్నాథ్ వెస్టిండీస్ జట్టుపై 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తీసుకున్నాడు. అదే టోర్నమెంట్లో రవిశాస్త్రి 26 పరుగులకు మూడు వికెట్లు తీసుకున్నాడు. 2011 ప్రపంచకప్లో జహీర్ ఖాన్ సైతం 26 పరుగులకు మూడు వికెట్లను తీసుకున్నాడు. తాజాగా వాటన్నింటినీ అధిగమించాడు మహమ్మద్ షమీ. ప్రపంచకప్లో వెస్టిండీస్పై నాలుగు వికెట్లను తీసుకున్న బౌలర్గా సరికొత్త రికార్డును సృష్టించాడు.