
బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైనా కూడా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు వెటరన్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ. వీళ్లిద్దరు టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి ఫిటెనెస్ సాధించేందుకు కష్ట పడుతున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ టెస్టుల్లో కూడా ఆడకపోతే వీరి స్థానాలను భర్తీ చేయడానికి కుర్రాళ్లను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
టెస్టు క్రికెట్లో టీమిండియాకు షమీ కీలకంగా ఉన్నాడు. అలాగే జడ్డూ కూడా అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో రాణిస్తూ వచ్చాడు. వన్డే సిరీస్కు కూడా ఎంపికైన షమీ.. భుజం గాయంతో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో చికిత్స తీసుకుంటున్నాడు. అదే సమయంలో సెప్టెంబరులో గాయపడిన జడ్డూ అప్పటి నుంచి జట్టుకు దూరంగానే ఉన్నాడు. తాజాగా గుజరాత్ ఎన్నికల్లో భార్య తరఫున ప్రచారంలో పాల్గొన్నాడు.
వీళ్లిద్దరూ బంగ్లా టెస్టులకు దూరమైతే వీరి స్థానాలను కుర్రాళ్లతో భర్తీ చేయాలని బీసీసీఐ అనుకుంటోందట. ఈ క్రమంలోనే నవదీప్ సైనీని షమీ రిప్లేస్మెంట్గా పంపాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో జడేజా స్థానాన్ని సౌరభ్ కుమార్తో భర్తీ చేయాలని చూస్తోంది. అయితే వీళ్లకు బంగ్లాతో టెస్టులు ఆడే అవకాశం వస్తుందా? అనేది అనుమానమే. ఇప్పటికే జట్టులో ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ వంటి బౌలర్లు ఉన్నారు. అలాంటప్పుడు మళ్లీ నవదీప్ సైనీని తీసుకుంటారా? అనేది చూడాలి.
అంతేకాదు, భారత నయా సంచలనం ఉమ్రాన్ మాలిక్ను టెస్టుల్లోనూ కొనసాగిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. వన్డే సిరీస్లో షమీ స్థానంలో ఎంపికైన మాలిక్ను టెస్టుల్లోనూ కొనసాగించాలని బీసీసీఐ చూస్తోందట. ఇదే జరిగితే నవదీప్ సైనీ కాకుండా ఉమ్రాన్ మాలిక్ను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే అతని వర్క్ లోడ్ మేనేజ్మేంట్లో భాగంగా ఉమ్రాన్ వంటి ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ను పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితం చేయాలని, టెస్టు ఫార్మాట్కు దూరంగా ఉంచాలని కొందరు సలహా ఇస్తున్నారు.