హైదరాబాద్: గువహటి వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య భారత్పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్కు వెళ్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాళ్ల దాడి జరిగింది.
ఈ దాడిలో బస్సు అద్దం ధ్వంసమైంది. ఈ దాడికి సంబంధించిన ఫోటోను ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ ట్విట్టర్లో అభిమానలతో పంచుకున్నాడు. 'హోటల్కు వెళ్తున్న దారిలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాయి విసరడం ఆందోళన కలిగించింది' అని ట్వీట్లో పేర్కొన్నాడు.
Pretty scary having a rock thrown through the team bus window on the way back to the hotel!! pic.twitter.com/LBBrksaDXI
— Aaron Finch (@AaronFinch5) 10 October 2017
Jeez. That's not nice at all Finchy @AaronFinch5 Hope no one's hurt !!! https://t.co/GVlBzZnLFK
— Russel Arnold (@RusselArnold69) 10 October 2017
ఈ ట్వీట్లో పగిలిన బస్సు అద్దం ఫొటోను కూడా జత చేశాడు. మరోవైపు ఈ ఘటనను భద్రతా సిబ్బంది చాలా సీరియస్గా తీసుకుంది. ఘటనపై స్థానిక అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది. క్రికెటర్లకు కల్పించిన భద్రతపై తాము సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే రాయి విసిరినప్పుడు విండో సీట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని క్రికెట్ ఆస్ట్రేలియా తన వెబ్సైట్లో రాసుకొచ్చింది. అయితే, ఈ ఘటన క్రికెటర్లను ఆందోళనకు గురి చేసినట్లు తెలిపింది. కాగా, గువహటి వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్ ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 118 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు టీ20ల సిరిస్ 1-1తో సమమైంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరగనుంది.