గబ్బాలో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ సాధించిన చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన యువ బౌలర్ షమార్ జోసెఫ్ను సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె. తారక రామారావు ప్రశంసించారు. సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వర్తించి అంతర్జాతీయ క్రికెటర్గా షమార్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సంచలన ఫాస్ట్ బౌలర్ను ఎదుర్కోవడానికి బ్యాటర్లు అందరూ సన్నద్ధమవ్వాలని షమార్ను కొనియాడుతూ ట్వీట్ చేశారు.
''షమార్ జోసెఫ్ జీవితం ఓ అద్భుతం. ఈ సంచలన కుర్రాడిని ఎదుర్కోవడానికి క్రికెట్ ప్రపంచం, బ్యాటర్లు సంసిద్ధంగా ఉండటం మంచిది. కంగారూల గడ్డపై 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం సాధించిన గబ్బా టెస్టు హైలైట్స్ను చూశాను. సూపర్ ఫామ్లో ఉన్న ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శన చూడటం చాలా ఆనందంగా ఉంటుంది'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

బొటలవేలు గాయంతో ఇబ్బంది పడుతున్నా షమార్ జోసెఫ్ సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. గబ్బా టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో ఏడు వికెట్లతో సత్తాచాటి వెస్టిండీస్ను గెలిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో 27 ఏళ్ల తర్వాత విండీస్కు ఇదే తొలి విజయం కావడం విశేషం. తన కెరీర్లో తొలి టెస్టు సిరీస్ ఆడుతున్న షమార్ 13 వికెట్లు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' దక్కించుకున్నాడు. అయితే షమార్ నేపథ్యం తెలిసిన తర్వాత ఎవరైనా అతడికి సెల్యూట్ చేయాల్సిందే. ఇటీవల సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ డివిలియర్స కూడా షమార్ జోసెఫ్ జీవితం గురించి తెలుసుకున్న తర్వాత ఫిదా అయిపోయినట్లు తెలిపాడు.
గయానా దీవుల్లోని ఓ మారుమూల పల్లెటూరిలోని పేదకుటుంబానికి షమార్ చెందినవాడు. 2018 ముందు వరకు ఆ ఊర్లో ఇంటర్నెట్ కూడా లేకపోవడం గమనార్హం.మొదట్లో మొద్దులు నరికే పనికి వెళ్లే షమార్ పెళ్లి చేసుకున్న తర్వాత పట్టణానికి వలస వెళ్లాడు. ఆ తర్వాత కూలీగా, సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూనే క్రికెట్ నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. డివిజన్-1 క్రికెట్లో అవకాశం వచ్చిన తర్వాత అతడి జీవితం మారిపోయింది. కరీబియన్ ప్రిమియర్ లీగ్లో నెట్బౌలర్గా ఛాన్స్ దక్కించుకున్నాడు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ల దృష్టిలో పడి మొత్తంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత నిలకడైన ప్రదర్శన చేస్తూ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు.