బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఓ అభిమానిని కొట్టి వార్తల్లో నిలిచాడు. సెల్ఫీ కోసం వెనుక నుంచి ఇబ్బందికి గురిచేసిన ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. అయితే షకిబ్కు వివాదాలు కొత్తేమి కాదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అతడు ఎన్నోసార్లు విమర్శలపాలయ్యాడు.
ఢాకా ప్రీమియర్ లీగ్లో ఏకంగా అంపైర్ల మీద విరుచుకుపడి సస్పెండ్కు కూడా గురయ్యాడు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచప్లో 'టైమ్డ్ ఔట్' అపీలు చేసినందుకు కూడా షకిబ్ విమర్శలు ఎదుర్కొన్నాడు. నిబంధనల ప్రకారమే షకిబ్ అపీలు చేసినప్పటికీ శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ అభ్యర్థించినా.. ఔట్ను వెనక్కి తీసుకోకపోవడంతో వివాదాస్పదంగా మారింది.

అయితే అభిమానిని షకిబ్ కొట్టిన తాజా సంఘటన బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో ఆదివారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఓటింగ్ రోజు పోలింగ్ బూత్కు వెళ్లిన షకిబ్ కోసం అభిమానులు అతని చుట్టూ పెద్దఎత్తున గుమిగూడారు. అతడితో అభిమానులు సెల్ఫీలు తీసుకోవడానికి, ముట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించడంటో పరిస్థితి తోపులాటగా మారింది. దీంతో విసిగిపోయిన షకిబ్ కంట్రోల్ తప్పి ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. వెంటనే మిగిలిన అభిమానులు షకిబ్ నుంచి వెనక్కి వెళ్లారు.
మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసిన షకిబ్ 1,85,388 ఓట్లతో భారీ విజయం సాధించాడు. అవామీ లీగ్ పార్టీ తరపున మగురా-1 స్థానం నుంచి పోటీ చేసి గెలిచాడు. షకీబ్ సమీప ప్రత్యర్థి కాజీ రెజౌల్ హుస్సేన్ 45,993 ఓట్లు మాత్రమే సాధించాడు. కాగా, షకిబ్ పోటీచేసిన పార్టీ అవామీ లీగ్ తిరిగి అధికారంలోకి వచ్చింది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. మొత్తం 300 సీట్లకుగానూ 299 స్థానాలకు ఎన్నికలు జరగగా అవామీ లీగ్ 200 స్థానాలు గెలుచుకుంది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టారు.