భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. కాన్పూర్ వేదికగా రేపటి నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ను వాళ్ల సొంతగడ్డపై ఓడించి 2-0తో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ అదే జోరును భారత్ గడ్డపై చూపించలేదు.
భారత బౌలర్లు ధాటికి బంగ్లా బ్యాటర్లు నిలవలేకపోయారు. ఇక భారత బ్యాటర్లు సాధికారిక బ్యాటింగ్కు బంగ్లాదేశ్ బౌలర్లు నిస్సహాయులుగా మారిపోయారు. అయితే టెస్టుల్లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ వివరించాడు. గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్న షకిబ్ తన రిటైర్మెంట్ గురించి కూడా మాట్లాడాడు.

టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో వన్డే ఫార్మాట్కు గుడ్బై పలుకుతానని పేర్కొన్నాడు. ఇక మీర్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టు సుదీర్ఘ ఫార్మాట్లో తన ఆఖరి మ్యాచ్ అని షకిబ్ చెప్పాడు. అయితే భద్రతాపరమైన కారణాలతో ఆ మ్యాచ్ జరగకపోతే రేపు జరిగే కాన్పూర్ మ్యాచే తన ఆఖరి టెస్టు అని అన్నాడు.
భారత్, పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ.. ''బంగ్లాదేశ్కు టీమిండియా వచ్చినప్పుడు మేం వన్డే సిరీస్ గెలిచాం. ఇక టెస్టు మ్యాచ్ను దాదాపు గెలిచేంతగా పోరాడాం. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో మా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. ఇక భారత్ పర్యటన అంటే అత్యంత కఠినమైనది. సొంతగొడ్డపై వాళ్లు ఓడిపోవడాన్ని మనం ఇటీవల చూడలేదు. భారత్ లేదా ఇతర పెద్ద జట్లతో మ్యాచ్ అంటే గొప్పగా రాణిస్తేనే సత్తాచాటగలం''
''టెస్టు క్రికెట్లో ప్రస్తుత పాకిస్థాన్కు అనుభవం లేదు. అదే భారత్ గురించి మాట్లాడాలంటే ఇది పెద్ద విషయం. టీమిండియా నంబర్ వన్ జట్టు. గతకొన్నేళ్లుగా సొంతగడ్డపై పరాజయం ఎరుగని జట్టు. భారత్కు ఏ టీమ్ వచ్చినా అది ఇబ్బంది పడాల్సిందే'' అని షకిబ్ అల్ హసన్ పేర్కొన్నాడు.