ఎప్పుడూ ఆవేశంగా ఉంటూ, వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారే బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ మరోసారి తన దురుసు ప్రవర్తనతో విమర్శలపాలయ్యాడు. పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్పై కోపంతో బంతి విసిరాడు. తలకు గాయమయ్యే ప్రమాదాన్ని రిజ్వాన్ తృటిలో తప్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే..
రావల్పిండి వేదికగా పాకిస్థాన్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు అయిదో రోజు ఆటలో షకిబ్ తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. షకిబ్ 33వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అయితే రెండో బంతిని ఎదుర్కోవడానికి రిజ్వాన్ కాస్త సమయం తీసుకున్నాడు. మరోవైపు కావాలనే ఆలస్యం చేస్తున్నాడని షకిబ్ కోపంతో రిజ్వాన్ తలకు మీదుగా బంతి విసిరాడు.

షకిబ్ నుంచి ఈ ప్రవర్తన చూసి పాకిస్థాన్ బ్యాటర్లు, అంపైర్లతో పాటు బంగ్లాదేశ్ ఫీల్డర్లు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనపై అంపైర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. షకిబ్ మాత్రం తనదే తప్పుంటూ దాన్ని అక్కడితో ముగించాడు. కాగా, పాకిస్థాన్పై బంగ్లాదేశ్ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. టెస్టు ఫార్మాట్లో పాక్పై తొలిసారి గెలుపు రుచి చూసింది.
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171*), సౌద్ షకీల్ (141) సెంచరీలతో సత్తాచాటారు. షోరిఫుల్, హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. శద్మాన్ ఇస్లామ్ (93), మెహదీ హసన్ (77) రాణించారు.
నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, షాజాద్, మహ్మద్ అలీ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, 117 పరుగుల వెనుకంజతో బ్యాటింగ్కు వచ్చిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో 146 స్కోరే సాధించింది. అనంతరం 30 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.