న్యూఢిల్లీ: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను కూడా భూకంపం వణించింది. ఢిల్లీలో సంభవించిన భూకంపంతో సెహ్వాగ్ కూడా బయటికి పరుగులు తీయాల్సి వచ్చింది. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో వచ్చిన ఈ భూకంపంతో బయటికి వచ్చి సెహ్వాగ్ లంచ్ చేశాడు.
ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలో సోమవారం భూకంపం సంభవించిన సమయంలో సెహ్వాగ్ ఢిల్లీలోనే ఉన్నాడు. 37ఏళ్ల సెహ్వాగ్ నివాసం ఢిల్లీలోని శ్రీనగర్లో ఉంది.
'భూ కంపం. అన్నీ ఊగుతున్నాయి సోదరా' అని సెహ్వాగ్ తన ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. భూకంపం కారణంగా సెహ్వాగ్ ఇంటి బయటే భోజనం చేయాల్సి వచ్చింది. భూకంపం గురించి 2.50గంటలకు మూడు ట్వీట్లు చేశాడు సెహ్వాగ్.
7.5తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, పంజాబ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు వణికిపోయాయి. ఆఫ్ఘనిస్థాన్లోని హిందూకుష్ పర్వతాల్లో భూకంప కేంద్రం ఏర్పడి ఉత్తరభారతదేశం వరకు ప్రకంపనలు వ్యాపించాయి.

వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ తోపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో మైసూరులో ఆదివారం జరిగిన మ్యాచులో ఆడిన సెహ్వాగ్.. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. నాలుగో రోజే డ్రాగా ముగిసిన ఈ మ్యాచులో హర్యానా జట్టు 3 పాయింట్లతో లీడ్లో ఉంది.
కాగా, నవాబ్ ఆఫ్ నజఫ్గఢ్గా పేరొందిన సెహ్వాగ్.. రిటైర్మెంట్ తర్వాత రంజీలో అద్భుతమైన సెంచరీ చేశాడు. సెహ్వాగ్ హర్యానా జట్టుకు ఆడుతున్నాఅతని సెంచరీని మైసూరుకు చెందిన అభిమానులు ఆస్వాదించారు. అతను బౌండరీలు బాదుతుంటూ అక్కడి అభిమానులు ఉత్సాహపర్చారు.