వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. వన్డే సిరీస్ లో పాకిస్తాన్ తుక్కు రేగ్గొట్టింది. చిత్తు చిత్తుగా ఓడించింది. అల్లాటప్పా గెలుపు కాదిది. 34 సంవత్సరాల పగను తీర్చుకున్నట్టయింది విండీస్ వీరులకు. 34 సంవత్సరాల తరువాత పాకిస్తాన్ పై వెస్టిండీస్ ఓ వన్డే సిరీస్ ను గెలవడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం పాకిస్తాన్.. వెస్టిండీస్ లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. మూడు వన్డే సిరీస్ లల్లో చివరి మ్యాచ్ తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 294 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్.. ఏ మాత్రం కూడా పోరాడలేకపోయింది. ఎంత ఘోరంగా ఆడిందంటే.. 92 పరుగులకే పాకిస్తాన్ జట్టు మొత్తం కొల్లాప్స్ అయింది. 30 పరుగులు చేసిన మిడిలార్డర్ బ్యాటర్ సల్మాన్ ఆఘా ఒక్కడే టాప్ స్కోరర్ అంటే మిగిలిన వాళ్లు ఎంత దయనీయంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.
ఒక దశలో 8 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. అయిదుమంది డకౌట్ అయ్యారీ మ్యాచ్ లో. ఓపెనర్లిద్దరిదీ అదే పరిస్థితి. బాబర్ ఆజమ్ గానీ, కేప్టెన్ మహ్మద్ రిజ్వాన్ గానీ.. విండీస్ బౌలింగ్ ప్రతాపానికి ఎదురు నిలవలేకపోయారు. నిప్పులు చెరిగే బంతులకు తలవంచారు.
ఓపెనర్లు సయీమ్ అయూబ్-0, అబ్దుల్లా షఫిక్- 0, బాబర్ ఆజమ్- 9, కేప్టెన్ మహ్మద్ రిజ్వాన్- 0.. ఇలా సాగింది టాప్ ఆర్డర్ బ్యాటింగ్. హసన్ రజా- 13, హుస్సేన్ తలత్- 1, మహ్మద్ నవాజ్- 23, నసీమ్ షా- 6, హసన్ అలీ-0, అబ్రార్ అహ్మద్- 0 (రనౌట్) చేతులెత్తేశారు.
వెస్టిండీస్ బౌలర్లల్లో జేడెన్ సీల్స్ చెలరేగాడు. 7.2 ఓవర్లల్లో 34 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు నేలకూల్చాడు. గుడకేష్ మోతీ- 2, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీసుకున్నారు. 1991 తరువాత పాకిస్తాన్ పై వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ గెలవడం వెస్టిండీస్ కు ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వెస్టిండీస్ కేప్టెన్ షై హోప్ సెంచరీతో చెలరేగాడీ మ్యాచ్ లో. 94 బంతుల్లో 10 ఫోర్లు, అయిదు భారీ సిక్సర్లతో 120 పరుగులు పిండుకున్నాడు. నాటౌట్ గా నిలిచాడు. జస్టిన్ గ్రీవ్స్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు కొట్టాడు.