
హైదరాబాద్: ఓపెనర్ షాయ్ హోప్ (146 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ సెంచరీతో చివరివరకు క్రీజులో నిలవడంతో బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో పర్యాటక వెస్టిండీస్ జట్టు నాలుగు వికెట్లతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్ను 1-1తో సమం చేసింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్మెన్లలో తమీమ్ ఇక్బాల్ (50), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (62), ఆల్రౌండర్ షకిబుల్ హసన్ (65) హాఫ్ సెంచరీలతో రాణించారు.
కాగా, వెస్టిండిస్ బౌలర్లలో ఒషేన్ థామస్ (3/54) కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్టు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం 256 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టులో హోప్ చెలరేగడంతో ఆరు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది.
విండిస్ బ్యాట్స్మెన్లలో డారెన్ బ్రేవో (27), మార్లోన్ శామ్యూల్స్ (26) ఫర్వాలేదనిపించగా, హేమ్రాజ్ (3), హెట్మైర్ (14), రావ్మన్ పావెల్ (1), ఛేజ్ (9) విఫలమయ్యారు. 185 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో హోప్కు కీమో పాల్ (18 నాటౌట్) అండగా నిలవడంతో 49.4 ఓవర్లలో 256 పరుగులు చేసి విజయాన్ని సాధించింది.
మొదటి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్లో నిర్ణయాత్మకమైన మూడో వన్డే శుక్రవారం జరుగనుంది.