అండర్ 19 ఆసియా కప్ 2024లో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్కు పాకిస్థాన్ 282 పరుగుల సవాలైన లక్ష్యం నిర్దేశించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 50 ఓవర్లలలో ఏడు వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఓపెనర్ షాజైబ్ ఖాన్ భారీ శతకం సాధించాడు. 147 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. ఈ క్రమంలో షాజైబ్ అరుదైన రికార్డులు నెలకొల్పాడు.
యూత్ వన్డేల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు సాధించిన పాకిస్థాన్ బ్యాటర్గా షాజైబ్ ఖాన్ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు కమ్రాన్ గులామ్ (7 సిక్సర్లు) పేరిట ఉండేది. అలాగే యూత్ వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్గానూ షాజైబ్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు షామైల్ హుస్సేన్ (150) పేరిట ఉండేది.

కాగా, పాకిస్థాన్ శుభారంభం దక్కింది. షాజైబ్ ఖాన్- ఉస్మాన్ ఖాన్ (60; 94 బంతుల్లో, 6 ఫోర్లు) తొలి వికెట్కు 30.4 ఓవర్లలో 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ క్రమంగా గేర్ మార్చి వేగంగా పరుగులు చేసింది. ఈ క్రమంలో ఇద్దరు అర్ధశతకాలు సాధించారు. అయితే మరింత ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఆయుష్ విడదీశాడు. అనంతరం భారత్ బౌలర్లు పుంజుకున్నారు. క్రమంగా వికెట్లు తీశారు.
Shahzaib Khan showcased a batting masterclass, hitting a well-paced century for his team! 🏏#ACC #ACCMensU19AsiaCup pic.twitter.com/6d58iDOHkj
— AsianCricketCouncil (@ACCMedia1) November 30, 2024
ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో మాత్రం షాజైబ్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. 100, 150+ మార్క్ను అందుకున్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో ఆఖరి ఓవర్లో షాజైబ్ వికెట్ కోల్పోయాడు. టీమిండియా బౌలర్లలో సమర్థ్ నాగరాజు మూడు వికెట్లు, ఆయుష్ రెండు, యుధజిత్, కిరణ్ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడుతుండగా.. రెండు గ్రూప్లుగా విభజించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్, జపాన్, యూఏతో గ్రూప్-బీలో ఉండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, నేపాల్ గ్రూప్-ఏలో ఉన్నాయి.