Shahid Afridi: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏప్రిల్లో పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 26 మందిని తమ మతాన్ని అడిగి మరీ హత్య చేశారు. దీనికి భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడి చేసింది. దానికి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారు. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ మొత్తానికి కూడా దీని గురించి ఏ మాత్రం తెలియదు. దీని తర్వాత పాకిస్థాన్ కూడా భారత్పై దాడి చేస్తోంది. దీని కారణంగా యుద్ధ పరిస్థితి తలెత్తింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు షాహిద్ అఫ్రిది భారత సైన్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నట్లు ఉన్న పాత వీడియో వైరల్ అవుతోంది. అఫ్రిది ఒక పాకిస్థాన్ ఛానెల్లో మాట్లాడుతూ.. 'భారత్ పాక్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది. కానీ మనం చాలా కాలంగా ఈ యుద్ధంలో ఉన్నాం. పాక్ సైన్యం ఎంత శిక్షణ పొందిందంటే వాళ్లు మనతో పోటీ పడలేరు." అంటూ షాహిద్ అఫ్రిది బీరాలు పలికాడు.

ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోన్న పాకిస్థాన్ కు చెందిన ఆటగాడు షాహిద్ అఫ్రిది.. ఉగ్రవాదాన్ని ఎవరూ సమర్థించరని అంటున్నాడు. అఫ్రిది మాట్లాడుతూ.. "ఉగ్రవాదానికి ఎవరు మద్దతు ఇస్తారు? ఏ దేశమూ చేయదు, ఏ మతమూ చేయదు. మన చాలా కాలంగా ఉగ్రవాదంతో పోరాడుతున్నాం. మన మతం శాంతి గురించి మాట్లాడుతుంది." అంటూ వ్యాఖ్యానించాడు.
అటారీ సరిహద్దుకు చేరుకున్న అఫ్రిది
పహల్గామ్ దాడి తర్వాత షాహిద్ అఫ్రిది చాలా చురుగ్గా ఉన్నాడు. వివాదం మధ్య గతంలో అఫ్రిది అటారీ-వాఘా సరిహద్దుకు చేరుకున్నాడు. ఇదే కాకుండా అఫ్రిది భారత్కు వ్యతిరేకంగా చాలా మాట్లాడాడు. భారత్ తన సొంత ప్రజలను చంపుకుని, పాకిస్థాన్ను నిందిస్తోందని అఫ్రిది ఒక ప్రకటనలో అన్నాడు. పాకిస్థాన్ టీవీ కార్యక్రమంలో అఫ్రిది భారత సైన్యాన్ని పనికిరానిదిగా, విలువలేనిదిగా అభివర్ణించాడు. దీంతో పాటు పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ ప్రమేయానికి రుజువును కూడా డిమాండ్ చేశాడు.