హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన అరుదైన గిప్ట్కు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కృతజ్ఞతలు తెలియజేశాడు. కొన్ని రోజుల క్రితం కరాచీలో షాహిద్ ఆఫ్రిది నూతన గృహప్రవేశం సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన గిఫ్ట్ అందజేశాడు.
'విరాట్ 18' అని ముద్రించి ఉన్న ఒక టీషర్ట్ను ఆఫ్రిదికి కానుకగా ఇచ్చాడు. ఈ కానుకను ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్న ఆఫ్రిది.. తాజాగా కోహ్లీతో పాటు టీమిండియాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. 'ఈ అద్భుతమైన ఫేర్వెల్ గిఫ్ట్ను నాకు ఇచ్చిన విరాట్కు అతని జట్టుకు థాంక్స్. ఇది ఎప్పటికీ నాకు ప్రత్యేకమే. విరాట్ అంటే నాకు చాలా అభిమానం. త్వరలోనే విరాట్ను కలుస్తానని ఆశిస్తున్నా' అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే ఆఫ్రిదికి ఇచ్చిన ఆ జెర్సీపై కోహ్లీతోపాటు, యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, బుమ్రా, రైనా, పవన్ నేగి, షమి, జడేజా, భువనేశ్వర్, రహానే, ధావన్, అశ్విన్, పాండ్యా, అప్పటి కోచ్ రవిశాస్త్రి ఆటోగ్రాఫ్లు ఉన్నాయి. ఈ గిప్ట్పై విరాట్ కోహ్లీ ఓ సందేశాన్ని కూడా రాశాడు.
'షాహిద్ భాయ్.. బెస్ట్ విషెస్.. నీతో ఆడటం ఎప్పుడూ నాకు సంతోషమే' అని విరాట్ కోహ్లీ ఓ సందేశం రాశాడు. దీనికి సంబంధించిన ఫొటోను పాకిస్థానీ జర్నలిస్ట్ పైజాన్ లఖానీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.
ఐసీసీ వరల్డ్ కప్ 2015 తర్వాత అప్రిది టెస్టు, వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత 2106లో ఐసీసీ వరల్డ్ టీ20లో పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. చివరకు ఫిబ్రవరి 20, 2017లో టీ20ల నుంచి కూడా వైదొలగుతున్నట్లు అప్రిది ప్రకటించాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అప్రిది 27టెస్టులు (1716 పరుగులు), 398 వన్డేలు (8064 పరుగులతో పాటు 395 వికెట్లు), 98 టీ20ల్లో (1405 పరుగులతో పాటు 97 వికెట్లు) తీశాడు.