ముంబై: ప్రపంచం మొత్తం ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్ ( కొవిడ్ 19)తో పోరాడుతోంది. సుమారు 190 దేశాలు ఈ ప్రాణాంతక వైరస్తో అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. సుమారు నాలుగున్నర లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు లాక్డౌన్ ప్రకటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.
కరోనా కోసం.. తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించిన పీవీ సింధు!!
అయితే లాక్డౌన్ కారణంగా అనేక మంది పేదలు నిత్యావసర సరకులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ముందుకొచ్చాడు. సుమారు 2 వేల కుటుంబాలకు ఉచితంగా రేషన్తో పాటు నిత్యవసర సరకులు అందజేశాడు. ఈ విషయాన్ని అఫ్రిదీ ట్విటర్లో పోస్టు చేయడంతో.. టీమిండియా వెటరన్ సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మెచ్చుకున్నాడు.
'మానవత్వంతో మంచి పని చేస్తున్నావు అఫ్రిది. అందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలి. నీకు మరింత శక్తి చేకూరాలి. ప్రపంచమంతా బాగుండాలని ప్రార్థిస్తున్నా' అని భజ్జీ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన అఫ్రిది.. అన్నింటికన్నా మానవత్వమే పెద్దదన్నాడు. అలాగే భజ్జీ దయార్థ హృదయంతో చెప్పిన మాటలకు ధన్యవాదాలు తెలిపాడు. 'కరోనా వైరస్పై పోరాడాలంటే ప్రపంచమంతా ఏకమవ్వాలి. పేదలకు, అవసరమైన వారికి వీలైనంత మేర సాయం చేయడం మన బాధ్యత' అని షాహిద్ అఫ్రిది రీట్వీట్ చేశాడు.
కరోనా బాధితులను ఆదుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆ దేశ ప్రభుత్వానికి రూ. 5 మిలియన్లు విరాళంగా ఇచ్చింది. జాతీయ అత్యవసర నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఎహ్సన్ మణి ప్రకటించారు. బోర్డులోని కిందిస్థాయి నుంచి సీనియర్ మేనేజర్ వరకు ఉన్న ఉద్యోగులు అంతా తమ ఒక్క రోజు జీతాన్ని జాతీయ అత్యవసర నిధికి అందజేయనున్నట్టు మణి వెల్లడించారు. ఇక జనరల్ మేనేజర్ ఆపై స్థాయి అధికారులు రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు చెప్పారు.