టీ20 ప్రపంచకప్ 2026 సందడిలో పాకిస్థాన్ క్రికెట్లో విమర్శల పర్వం కొనసాగుతోంది. పాక్ ఆల్రౌండర్ షదాబ్ ఖాన్ ఇటీవల మాజీ ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఘాటుగా స్పందించాడు. విమర్శకులకు నోటితో కాకుండా మైదానంలో ఆటతో సమాధానం చెప్పాలని షాహిద్ అఫ్రిది హితవు పలికాడు.
అసలేం జరిగిందంటే?
నమీబియాపై విజయం సాధించిన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో షదాబ్ ఖాన్ మాజీల విమర్శలపై అసహనం వ్యక్తం చేశాడు. 2021లో భారత్ను ఓడించిన జట్టులో తాను సభ్యుడినని, ఆ ఘనత సాధించని వారు కూడా తమను విమర్శించడం సరికాదని షదాబ్ ఖాన్ పేర్కొన్నాడు. ఈ కామెంట్స్ పాక్ క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.

అఫ్రిది స్ట్రాంగ్ కౌంటర్
షదాబ్ ఖాన్ కామెంట్స్పై స్పందించిన షాహిద్ అఫ్రిది ఓ టీవీ ఛానెల్ చర్చలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2021లో భారత్ను ఓడించినప్పుడు ఈ జట్టుకు దక్కిన గౌరవాన్ని వారు నిలబెట్టుకోలేకపోయారని షాహిద్ అఫ్రిది విమర్శించాడు. షదాబ్ ఖాన్ ఫామ్లో లేనప్పుడు కూడా తాము జాతీయ టీవీ వేదికగా అతనికి మద్దతు తెలిపామని.. జట్టుకు అతను వెన్నెముక అని కొనియాడామని గుర్తు చేశాడు."షదాబ్ బేటా.. బాగా ఆడు. మా కాలంలో ఎవరైనా విమర్శిస్తే మేము మైదానంలో ఆటతో సమాధానం చెప్పేవాళ్లం" అని అఫ్రిది పేర్కొన్నాడు. కేవలం చిన్న జట్లపై కాకుండా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి పెద్ద జట్లపై రాణించాలని సూచించాడు. షదాబ్ దేశవాళీ క్రికెట్ ఆడకపోయినా అతనికి జాతీయ జట్టులో చోటు దక్కిందని, అటువంటి సమయంలో తాము మద్దతుగా నిలిచామని అఫ్రిది గుర్తు చేశాడు.
పీసీబీ సీరియస్
షదాబ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా సీరియస్ అయ్యింది. షదాబ్ను బోర్డు హెచ్చరించినట్లు సమాచారం. అలాగే, ఆటగాళ్లు మీడియా సమావేశాల్లో కేవలం టోర్నీ, జట్టు ప్రదర్శన గురించి మాత్రమే మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
ముందున్న అసలైన పరీక్ష
సూపర్-8లో పాకిస్థాన్ తన మొదటి పోరులో శనివారం న్యూజిలాండ్తో తలపడనుంది. కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో షదాబ్ ఖాన్ తన ఆటతో విమర్శకులకు సమాధానం చెబుతారా లేదా అన్నది వేచి చూడాలి.