హైదరాబాద్: అభిమానుల మాదిరిగానే భారత్-పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఎంతో ఆశగా, ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వెల్లడించాడు. ఈ ఏడాది జూన్ 1 నుంచి లండన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జూన్ 1 నుంచి జూన్ 18 వరకు జరిగే ఈ టోర్నీలో తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఇక దాయాది దేశాలైన ఇండియా-పాకిస్థాన్ జట్లు జూన్ 4(ఆదివారం) ఎడ్జిబాస్టన్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు అఫ్రిది తెలిపాడు.
ఐసీసీ వెబ్సైట్కి రాసిన కాలమ్లో ఈ ఏడాది భారత్పై విజయం సాధించి విజయాల రికార్డును మెరుగుపరుచుకోవాలని పాకిస్థాన్ యోచిస్తోందని అఫ్రిది పేర్కొన్నాడు. పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం అద్భుతమైన బౌలింగ్ లైనప్ని కలిగి ఉందని, పాకిస్థాన్కు ఇది కలిసొచ్చే అంశమని చెప్పాడు.

దీంతో పాటు టీమిండియా ఆటగాళ్లతో ఉన్న స్నేహంపై కూడా ఆఫ్రిది స్పందించాడు. 'నాకు చాలామంది భారత ఆటగాళ్లతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ముగ్గురితో నాకు అత్యంత చనువు ఉంది. అయితే గౌతం గంభీర్ తోమాత్రం నాకు మంచి సంబంధాల్లేవ్' అని అప్రిది చెప్పాడు.
'గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక మ్యాచ్లో మా ఇద్దరి మధ్య వాడివేడి మాటల యుద్ధం జరిగింది. అప్పటి నుంచి గంభీర్ నాతో మాట్లాడటం మానేశాడు. ఆటగాళ్ల మధ్య వాగ్వివాదం అనేది ఆటలో సహజం. కాకపోతే గంభీర్ మాత్రం దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. అంతకుముందు కూడా ఇద్దరం కలిసి స్నేహంగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు' అని ఆఫ్రిది తన పాత జ్ఞాపకాల్నినెమరవేసుకున్నాడు.
ఇదిలా ఉంటే ఐసీసీ ప్రకటించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2017కి అఫ్రిది అంబాసిడర్గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా 2004, 2009లలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్పై పాక్ పైచేయి సాధించింది.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అఫ్రిదికి 'విరాట్ 18' అని ముద్రించి ఉన్న ఒక టీషర్ట్ను ఆఫ్రిదికి కానుకగా ఇచ్చాడు. ఈ కానుకను ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్న ఆఫ్రిది.. తాజాగా కోహ్లీతో పాటు టీమిండియాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. 'ఈ అద్భుతమైన ఫేర్వెల్ గిఫ్ట్ను నాకు ఇచ్చిన విరాట్కు అతని జట్టుకు థాంక్స్. ఇది ఎప్పటికీ నాకు ప్రత్యేకమే. విరాట్ అంటే నాకు చాలా అభిమానం. త్వరలోనే విరాట్ను కలుస్తానని ఆశిస్తున్నా' అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే ఆఫ్రిదికి ఇచ్చిన ఆ జెర్సీపై కోహ్లీతోపాటు, యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, బుమ్రా, రైనా, పవన్ నేగి, షమి, జడేజా, భువనేశ్వర్, రహానే, ధావన్, అశ్విన్, పాండ్యా, అప్పటి కోచ్ రవిశాస్త్రి ఆటోగ్రాఫ్లు ఉన్నాయి. ఈ గిప్ట్పై విరాట్ కోహ్లీ ఓ సందేశాన్ని కూడా రాశాడు.
'షాహిద్ భాయ్.. బెస్ట్ విషెస్.. నీతో ఆడటం ఎప్పుడూ నాకు సంతోషమే' అని విరాట్ కోహ్లీ ఓ సందేశం రాశాడు. దీనికి సంబంధించిన ఫొటోను పాకిస్థానీ జర్నలిస్ట్ పైజాన్ లఖానీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.