హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు జెర్సీ ధరించినందుకు భారత క్రికెట్ అభిమానిపై కేసు నమోదు చేసి జైలు పాలు చేసిన ఘటనపై పాకిస్థాన్ వెటరన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. 'అక్కడ ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటుగా ఉంది. క్రికెట్ను రాజకీయం చేయడం దారుణం' అని జంగ్ న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.
వివరాల్లోకి వెళితే పాకిస్థాన్ జట్టు జెర్సీ ధరించినందుకు ఓ క్రికెట్ అభిమాని జైలు పాలయ్యాడు. అసోంలోని హైలకాండి జిల్లాలో శనివారం జరిగిన ఒక స్థానిక క్రికెట్ మ్యాచ్ కు రిపున్ చౌదరీ అనే అఫ్రీది అభిమాని పాక్ జెర్సీ ధరించి స్టేడియంలోకి వచ్చాడు.

దీంతో భారతీయ యువ మోర్చా కమిటీకి చెందిన కొందరు సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సెక్షన్ 120(B), 294 కింద కేసు నమోదు చేశారు. జైలు పాలైన ఆ అభిమాని పాకిస్థాన్ వెటరన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రీది అభిమాని కావడం గమనార్హం.
దీంతో ఈ సంఘటనపై స్పందించిన అఫ్రిది అతడిని జైలు నుంచి విడుదల చేసే విషయంలో ప్రధాని నరేంద్రమోడీ కలగజేసుకోవాలని కోరాడు. భారత జట్టు ఆటగాళ్లకు పాకిస్థాన్లో ఎలాగైతే అభిమానులు ఉంటారో, అదేవిధంగా భారత్లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడు.
ఇరు దేశాల్లో కూడా క్రికెట్ లవర్స్ను క్రికెట్ అభిమానులుగానే చూడాలని షాహిద్ అఫ్రిది సూచించాడు. ఇదిలా ఉంటే గతంలో ఇలాంటి సంఘటనే ఒకటి పాకిస్థాన్లో చోటు చేసుకుంది. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానించే ఉమెర్ డరాజ్ అనే ఓ పాకిస్థాన్ వ్యక్తి తన ఇంటిపై భారత త్రివర్ణ పతాకం ఎగరవేయడంతో దేశద్రోహం నేరం కింద పదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.