ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించడంపై పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే దీనికి భారత క్రికెటర్లను నిందించడం సరికాదని, సోషల్ మీడియా ఒత్తిడి, దేశభక్తి భావనల కారణంగా బీసీసీఐ నంచి వారికి పైనుంచి ఆదేశాలు వచ్చాయని షాహిద్ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశారు.
వివాదం ఎలా మొదలైందంటే?
దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ గ్రూప్-ఏ మ్యాచ్లో భారత్ పాకిస్థాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఆనవాయితీగా కరచాలనం చేసుకుంటారు. కానీ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, జట్టు సభ్యులు దీనికి నిరాకరించి నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు. ఈ సంఘటన పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అయితే మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై ఫిర్యాదు చేసి టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని కూడా బెదిరించింది. ఈ చర్యకు నిరసనగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ వేడుకలో కూడా పాల్గొనలేదు.

షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ మీడియా ఛానెల్ 'సమా టీవీ'లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. "ఆసియా కప్ ప్రారంభమైనప్పుడు భారత్-పాక్ మ్యాచ్ను బహిష్కరించాలనే ప్రచారాలు సోషల్ మీడియాలో విపరీతంగా సాగాయి. ఈ ఒత్తిడి కారణంగానే ఆటగాళ్లను బీసీసీఐని మా జట్టుతో చేతులు కలపవద్దని చెప్పడంలో ఆశ్చర్యం లేదు" అని షాహిద్ అఫ్రిది అన్నారు. "నా అభిప్రాయంలో ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. దీని వల్ల వారు ప్రపంచం ముందు మరోసారి సిగ్గుపడతారు. మా వైఖరి సరైనదే. మా పీసీబీ ఛైర్మన్ సరైన నిర్ణయం తీసుకున్నారు." అని షాహిద్ అఫ్రిది పేర్కొన్నారు. అయితే అఫ్రిది తన వ్యాఖ్యల్లో ఒక మెలిక పెడుతూ.. "భారత క్రికెటర్లను నేను తప్పుపట్టాలనుకోవడం లేదు. వారి పైనుంచి ఆదేశాలు వచ్చాయి." అని చెప్పడం విశేషం. ఆటగాళ్లు తమ దేశానికి గొప్ప రాయబారులుగా ఉండాలి తప్ప, అవమానకరంగా ప్రవర్తించకూడదని అఫ్రిది వ్యాఖ్యానించారు.
ఈ వివాదంపై పీసీబీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను మిగతా మ్యాచ్ల నుంచి తొలగించాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ ఆ ఫిర్యాదును తిరస్కరించింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలన్న పాకిస్థాన్ డిమాండ్ను ఐసీసీ అంగీకరించినట్లు తెలిసింది. పాక్ మ్యాచులకు ఆండీ పైక్రాఫ్ట్ను ఐసీసీ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. యూఏఈతో మ్యాచ్ కు రిఫరీగా రిచర్డ్సన్ను నియమించినట్లు సమాచారం.