కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కూతురుకు చెందిన వార్త ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఆమె చనిపోయిందని చెబుతూ ఓ ఫోటోను ఆన్లైన్లో పెట్టారు. ఇది ఇప్పుడు వైరల్ అయింది. గులాబీ రంగు దుస్తుల్లో ఉన్న ఆ బాలిక పైన, గులాబీ పూలు పరిచారు. అది చనిపోయినట్లుగా ఉంది.
ఈ ఫోటో కొద్ది రోజులుగా ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లే. ఇందుకు సంబంధించి అసలు నిజం మరోలా ఉంది.
మూడు వారాల క్రితం షాహిద్ అప్రిదీకి చెందిన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశాడు. తన కూతురు ఆసుపత్రిలో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. అంతేకాదు, 'గెట్ వెల్ సూన్ అమ్సారా' అని పోస్ట్ చేశాడు. అమ్సారా అఫ్రీది కూతురు.

అయితే, ఏప్రిల్ 25వ తేదీ నుంచి అమ్సారా క్యాన్సర్తో చనిపోయిందని పుకార్లు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియోను నెట్లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది.
ఓ వైపు ఆమె చనిపోయిందంటూ పుకార్లు నెట్లో హల్చల్ చేస్తుండగా, ఆమె మాత్రం ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుందని తెలుస్తోంది. అంతేకాదు, ఆమె బాగా రికవరీ అయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె పైన పుకార్లు వచ్చాయి.