ఛాంపియన్స్ ట్రోఫీ వేట మొదలైపోయింది. భారత్-పాక్ కూడా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఉండే పోరు, వైరం గురించి మాజీ ప్లేయర్స్ యువరాజ్ సింగ్, షాహిద్ అఫ్రిదీ, ఇంజిమామ్ మాట్లాడారు. ప్రస్తుతం ఆటగాళ్లలో అంత మ్యాటర్ ఏమీ లేదని అన్నారు.
1990ల నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత్-పాక్ మధ్య వైరం కొనసాగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రెండిటి మధ్య మ్యాచ్ జరిగిందంటే ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోతారు. అభిమానులతో స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. ఇదే సమయంలో మైదానంలో ఆటగాళ్లు దూకుడుగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయి ఆడుతుంటారు. మరి ఇప్పుడు కూడా ఆటగాళ్లలో అలాంటి దూకుడు కనిపిస్తోందా అనే విషయంపై మాట్లాడారు మాజీ ఆటగాళ్లు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో దీనిపై స్పందించారు.

అంతా జుజుబీ..
ఈ చర్చా కార్యక్రమంలో భాగంగా మాజీ ప్లేయర్ ఇంజిమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ టీమిండియా మధ్య ప్రేమాభిమానాలు ఉన్నాయని అన్నాడు. ఎంత ఎక్కువ ప్రేమిస్తే.. అంత ఎక్కువ వైరాలు వస్తాయని చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు పాక్ - భారత్ రెండూ ఒకే దేశమని గుర్తు చేశాడు. ఈ క్రమంలోనే అఫ్రిదీ మాట్లాడుతూ.. గతంలో భారత్-పాక్ మ్యాచ్ లో ఉండే దూకుడు ఇప్పుడు కరువైందని అన్నాడు. "ఇప్పుడు ఆటగాళ్లంతా మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ తరంవాళ్లు" అని పేర్కొన్నాడు.
కాగా, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.