
శ్రీలంక టెస్ట్ సిరీస్లో గాయపడ్డ షాహీన్
శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో తొలి టెస్ట్ అనంతరం మోకాలి స్నాయువు గాయం కారణంగా షాహీన్ అఫ్రిది గాయపడ్డ సంగతి తెలిసిందే. అతని గాయం తీవ్రత ఎక్కువవ్వడంతో ఇటీవల యూఏఈలో ముగిసిన ఆసియా కప్ జట్టుకు కూడా అతను దూరమయ్యాడు. అతను టీ20 ప్రపంచకప్లో పాల్గొనడంపై ఇప్పటికీ అనిశ్చితి నెలకొంది. అయితే ఇంగ్లాండ్లో చికిత్స, పునరావాసం సాఫీగా జరిగింది. ప్రపంచకప్ టైం నాటికి పూర్తిగా కోలుకునే సంకేతాలను షాహీన్ చూపించాడు. అయితే షాహీన్ అఫ్రిది హాస్పిటల్, ఇతర పునరావాస ఖర్చులను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భరించడం లేదని అతనికి మామయ్య వరుస అయ్యే పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టిక్కెట్ డబ్బులు కూడా ఇవ్వలేదు
'షాహీన్ అఫ్రిది ఇంగ్లాండ్కు తన సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని వెళ్లాడు. అతనికి టిక్కెట్ డబ్బులు కూడా పీసీబీ ఇవ్వలేదు. పూర్తిగా ప్రయాణ ఖర్చులను కూడా అతనే భరించాడు. తన సొంత డబ్బుతో హాస్పిటల్ ఖర్చులు భరిస్తూ ఇంగ్లాండ్లో కోలుకుంటున్నాడు. నేను అతని కోసం అక్కడ ఓ స్పెషాలిటీ వైద్యుడిని ఏర్పాటు చేశాను. అతను ఇంగ్లాండ్లో దిగాక ఆ వైద్యుడిని కలిశాడు. రికవరీ ప్రాసెస్ బానే జరిగింది. ఈ అన్ని విషయాల్లో పీసీబీ మాత్రం అతనికి నయా పైసా ఇవ్వలేదు.

పాపం ప్రతీది తన పాకెట్ నుంచే పెట్టుకున్నాడు.
'అతన్ని ఇంగ్లాండ్కు పంపించడం, హాస్పిటల్ బిల్లులు, అతని వసతి వరకు ఏదీ కూడా పీసీబీ భరించలేదు. పాపం ప్రతీది తన పాకెట్ నుంచి షాహీన్ పెట్టుకున్నాడు. జాతీయ జట్టుకోసం ఆడి గాయపడితే అతనికి పీసీబీ అండగా నిలబడకపోవడం నిజంగా విచారకరం. అదే ఇండియాలో అయితే గాయపడ్డ ప్లేయర్ల కోసం బీసీసీఐ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుందో చూశారుగా.. ప్రత్యేకంగా ఎన్సీఏలో అతను కోలుకునేంత వరకు అన్ని రకాల ఫైనాన్షియల్, మోరల్ సపోర్ట్ ఇస్తుంది. షాహీన్ ఇంగ్లాండులో ఉండగా.. పీసీబీ అంతర్జాతీయ క్రికెట్ డైరెక్టర్ జాకీర్ ఖాన్ ఒకట్రెండు సార్లు ఫోన్ చేసి పరామర్శించాడు. కానీ ఎలాంటి ఫినాన్షియల్ సపోర్ట విషయమై పెదవి విప్పలేదు.' అని అఫ్రిది సమా టివిలో జరిగిన చర్చలో చెప్పారు.

తగిన విశ్రాంతి అందించాలని
ఇదిలా ఉండగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ మెగా ఈవెంట్కు ముందు అతనికి తగిన విశ్రాంతిని అందించాలని పాక్ జట్టు మేనేజ్ మెంట్ భావిస్తున్నందున.. ఇంగ్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్, న్యూజిలాండ్లో జరిగే ట్రై-సిరీస్లో అతను పాల్గొనడం లేదు. టీ20 ప్రపంచకప్కు ముందు షాహీన్ కోలుకునే విషయాన్ని జట్టు పర్యవేక్షిస్తోందని పాక్ చీఫ్ సెలెక్టర్ మహ్మద్ వాసిమ్ తెలిపారు. 'మేము షాహీన్ గాయాన్ని పూర్తిగా అంచనా వేస్తున్నాం. అతను పూర్తి ఫిట్గా ఉంటాడని ఆశిస్తున్నాం' అని లాహోర్లో విలేకరుల సమావేశంలో వసీమ్ తెలిపాడు. ముఖ్యంగా మెల్బోర్న్లో అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి భారత్తో జరిగే బ్లాక్బస్టర్ క్లాష్తో పాకిస్థాన్ తమ టీ20 వరల్డ్ కప్ టోర్నీని ప్రారంభిస్తుంది.


Click it and Unblock the Notifications












