
రాంచీ: కేవలం మూడు బంతుల్లోనే అరంగేట్ర బెదురు పోయింది. సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల నుండి ఎంతో నేర్చుకోవచ్చు అని భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ పేర్కొన్నాడు. సొంత మైదానంలో వికెట్లు తీయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. 30 ఏళ్ల ఝార్ఖండ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ రాంచీ టెస్టులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో తెంబా బవుమా, అన్రిచ్ నోర్జె వికెట్లు తీసాడు.
సోమవారం మ్యాచ్ అనంతరం నదీమ్ మాట్లాడుతూ... 'తొలి టెస్ట్ కోసం ఆత్రుత చెందాను. ఎంతో భావోద్వేగానికి గురయ్యా. వెంటనే తేరుకుని మ్యాచుపై దృష్టిపెట్టా. మొదటి మూడు బంతుల వరకు ఆందోళన పడ్డాను. ముఖ్యంగా రన్నప్ విషయంలో. నాలుగో బంతి నుండి బెరుకు పోయింది. నా బౌలింగ్ శైలిపై నిరంతరం కష్టపడుతున్నా. బౌలింగ్ శైలితో నా శరీర బరువు సరితూగేలా చూసుకోవాలి' అని అన్నాడు.
'అరంగేట్రం కోసం చాలా శ్రమించా. ఇన్నేళ్ల శ్రమకు ఫలితం దక్కడం ఆనందంగా ఉంది. నా సొంతగడ్డపై అరంగేట్రం చేయడం ప్రత్యేక అనుభూతి. సీనియర్లు అశ్విన్, జడేజాతో కలిసి బౌలింగ్ చేయడం బాగుంది. వారి అనుభవాన్ని నాతో పంచుకున్నారు. చాలా విషయాలు చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో వారిద్దరూ మొదటి స్థానంలో ఉంటారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. జట్టుకు అందించేందుకు నా వంతు కృషి చేస్తా' అని నదీమ్ పేర్కొన్నాడు.
ఇన్నింగ్స్ 28వ ఓవర్ రెండో బంతికి టెంబా బావుమా(32) ను నదీమ్ ఔట్ చేసాడు. నదీమ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన బావుమా వికెట్ల ముందుకొచ్చి ఆడాడు. ఈ సమయంలో సాహా ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహారించి అతడిని పెవిలియన్కు చేర్చాడు. టెస్టుల్లో షాబాజ్ నదీమ్కు ఇదే తొలి వికెట్. తొలి వికెట్ తీసిన ఆనందంలో అతడు మైదానంలో సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు సహకర క్రికెటర్లు సైతం అతడిని అభినందనలతో ముంచెత్తారు.