సన్రైజర్స్ హైదరాబాద్కు ఊహించని ఓటమి ఎదురైంది. క్వాలిఫయిర్-1లో ఫేవరేట్గా బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. అన్ని విభాగాల్లో విఫలమై ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే టైటిల్ రేసులో హైదరాబాద్ ఇంకా నిలిచే ఉంది. క్వాలిఫయిర్-2లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ తుది పోరుకు చేరుతుంది. మరోవైపు కేకేఆర్ నేరుగా ఫైనల్ చేరింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ మిచెల్ స్టార్క్ (3/34) మూడు, వరుణ్ చక్రవర్తి (2/26) ధాటికి 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో, 7x4, 1x6) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనకు దిగిన కేకేఆర్ 13.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. శ్రేయస్ అయ్యర్ (58*; 24 బంతుల్లో, 5x4, 4x6), వెంకటేశ్ అయ్యర్ (51*; 28 బంతుల్లో, 5x4, 4x6) అజేయ అర్ధశతకాలు సాధించారు.

అయితే సన్రైజర్స్ ఓ దశలో 39 పరుగులకే నాలుగు వికెట్లు పీకల్లోతు కష్టాల్లో పడింది. హెన్రిచ్ క్లాసెన్ (32; 21 బంతుల్లో, 3x4, 1x6)తో కలిసి రాహుల్ త్రిపాఠి 62 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. క్లాసెన్ ఔటైన తర్వాత అబ్దుల్ సమద్ (16; 12 బంతుల్లో, 2x6) క్రీజులోకి వచ్చాడు. అయితే అబ్దుల్ లేని పరుగుకు ప్రయత్నించడంతో మరో ఎండ్లో ఉన్న త్రిపాఠి రనౌటయ్యాడు.
అనంతరం మైదానాన్ని వీడిన రాహుల్ త్రిపాఠి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లే దారిలో మెట్లపైనే భావోద్వేగానికి గురయ్యాడు. జట్టును పటిష్ట స్థితిలో ఉంచకుండానే ఔటయ్యాననే బాధతో కుమిలిపోయాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ మ్యాచ్ ముగిసిన అనంతరం త్రిపాఠిని ప్రత్యేకంగా పలకరించాడు. ధైర్యం చెబుతూ వచ్చే మ్యాచ్లో బలంగా తిరిగిరామని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. త్రిపాఠి గతంలో కేకేఆర్ తరఫున ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
అయితే స్టేడియంలోని కోల్కతా అభిమానులకు అభివాదం చేస్తూ మాజీ క్రికెటర్ల లైవ్ను చూడకుండా షారుక్ పొరపాటు చేశాడు. మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, పార్థివ్ పటేల్, ఆకాశ్ చోప్రా మ్యాచ్ గురించి లైవ్లో విశ్లేషిస్తుండగా షారుక్ వాళ్లకు అంతరాయం కలిగించాడు. వెంటనే తన తప్పును గ్రహించి రైనా, పార్థివ్, ఆకాశ్కు క్షమాపణలు చెప్పాడు. ఫ్రెండ్లీ హగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో షారుక్ వ్యక్తితత్వాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కొనియాడుతున్నారు.