హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సహ యజమాని షారూఖ్ ఖాన్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు క్షమాపణ చెప్పారు. ఐపీఎల్ 11లో భాగంగా జరిగిన 41వ మ్యాచ్లో కోల్కతా, ముంబై జట్లు తలపడ్డాయి. ఈ పోరులో ముంబై జట్టు 102పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్తో అప్పటివరకూ ఉన్న స్థానాలన్నీ దాటుకొని టాప్ 4స్థానానికి చేరిపోయింది ముంబై జట్టు.
ఈ విషయంపై షారూఖ్ 'ఆటల్లో గెలుపోటములనేవి సహజం. కానీ, ఇవాళ ఘోరంగా ఓటమి పాలవడం చాలా నిరుత్సాహానికి గురి చేసింది. జట్టు యజామానిగా నేను దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. అందుకే మిమ్మల్ని మన్నింపు కోరుతున్నాను' అని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
జూహీ చావ్లా, ఆమె భర్త జెయ్ మెహతాలతో పాటుగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సహ యజమాని షారూఖ్. వరుసగా జరిగిన రెండు మ్యాచ్ లలోనూ ముంబై చేతిలోనే పరాజయం పొందడం జట్టుకు అవమానకరంగా మారింది. మరోవైపు ప్లే ఆఫ్ ఆశలు చేజారిపోతాయన్న పరిస్థితుల్లో నుంచి తేరుకున్న ముంబై జట్టు టాప్ 4స్థానంలో నిలిచింది.
బుధవారం ముంబై ఆడిన మ్యాచ్లో ముంబై విజయాన్ని అటుంచి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఒక్కటే చర్చనీయాంశమైంది. కేవలం 21 బంతుల్లో 62పరుగులు చేశాడు. దీంతో ముంబై జట్టు 210 స్కోరును చేయగలిగింది. చేధనకు దిగిన కోల్కతా 18.5 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.