మెరుపు ఇన్నింగ్స్లు కొనసాగిస్తా:
మ్యాచ్ అనంతరం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అందుకునే సమయంలో షెఫాలీ వర్మ మాట్లాడుతూ... 'సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన మ్యాచ్లో లేకపోవడంతో ఎంతో బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు శుభారంభం అందించాలనుకున్నా. భారీ షాట్లు ఆడటం కోసం బంతిని బలంగా బాదుతూ ప్రాక్టీస్ చేశా. జట్టుకు మరిన్ని విజయాలు అందించడమే నా అంతిమ లక్ష్యం. భారత్ ప్రపంచకప్ను అందుకునే వరకు నా మెరుపు ఇన్నింగ్స్లను ఇలానే కొనసాగిస్తా' అని తెలిపింది.
షెఫాలీ మెరుపులు:
పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. షెఫాలీతో పాటు జెమీమా రోడ్రిగ్స్ (34, 37 బంతుల్లో; 2×4, 1×6) ఆకట్టుకుంది. ఇన్నింగ్స్ చివరలో వేదా కృష్ణమూర్తి (20*, 11 బంతుల్లో; 4×4) బ్యాటు ఝళిపించింది. బంగ్లా బౌలర్లలో సల్మా ఖాతున్, పన్నా ఘోశ్ చెరో రెండు వికెట్లు తీశారు.
తిప్పేసిన పూనమ్:
అనంతరం బరిలోకి దిగిన బంగ్లా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. ఆస్ట్రేలియాపై 4 వికెట్లతో చెలరేగిన స్పిన్నర్ పూనమ్ యాదవ్.. బంగ్లాపై 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించింది. పేసర్ శిఖ పాండే, అరుంధతీ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. ఖాటూన్ (30; 26 బంతుల్లో 4×4), నిగర్ (35) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
అగ్రస్థానంలో భారత్:
తాజా విజయంతో నాలుగు పాయింట్లతో గ్రూప్-ఎలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రెండు పాయింట్లతో కివీస్ రెండో స్థానంలో, అదే రెండు పాయింట్లతో ఆసీస్ మూడో స్థానంలో ఉన్నాయి. బంగ్లా, లంక ఇంకా ఖాతా తెరవలేదు. తర్వాతి మ్యాచ్లో ఫిబ్రవరి 27న న్యూజీలాండ్ మహిళలతో భారత మహిళలు ఢీ కొంటారు. ఇక ఈ టోర్నీ తొలి మ్యాచ్లో ఆసీస్పై భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే.