ముంబై: భారత మహిళల క్రికెట్ టీనేజ్ సెన్సేషన్, స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు మరో బంపర్ ఆఫర్ లభించింది. ఇంగ్లండ్లో జరిగే హండ్రెడ్లో బర్మింగ్హామ్ ఫోనిక్స్కు ఆడనున్న షఫాలీ.. ఆస్ట్రేలియాలో జరిగే మహిళల బిగ్బాష్ లీగ్ టీ20 టోర్నమెంట్లో కూడా బరిలోకి దిగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అలాగే వర్మ తండ్రి రాజీవ్ సైతం ఈ విషయాన్ని తెలిపారు. బిగ్బాష్ లీగ్లో షఫాలీ సిడ్నీ సిక్సర్స్ టీమ్కు ప్రాతినిధ్యం వహిస్తుంది.
స్టీవ్ స్మిత్ ఉన్నా.. అప్పుడే నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా: టిమ్ పైన్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రస్తుతం నంబర్వన్గా ఉన్న 17 ఏళ్ల షఫాలీ వర్మ భారత్ తరఫున 22 మ్యాచ్లలో 148.31 స్ట్రయిక్రేట్తో 617 పరుగులు చేసింది. క్రీజులోకి రావడమే ఆసల్యం బాదుడే లక్ష్యంగా ఆడడం షఫాలీ శైలి. బౌలర్ ఎవరైనా పరుగులు చేయడమే ఆమెకు తెలుసు. అందుకే 'లేడీ సెహ్వాగ్' అని కూడా అభిమానులు కొందరు షఫాలీని ముద్దుగా పిలుచుకుంటారు. మరో భారత క్రీడాకారిణి, 21 ఏళ్ల రాధా యాదవ్ కూడా బిగ్బాష్లో ఆడే అవకాశం ఉంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్తో కూడా సిడ్నీ సిక్సర్స్ టీమ్ చర్చలు తుది దశకు చేరాయని సమాచారం.
టీమిండియా టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (సిడ్నీ థండర్స్), స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (బ్రిస్బేన్ హీట్), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్వుమన్ వేదా కృష్ణమూర్తి (హోబర్డ్ హరికేన్) ఇప్పటికే బిగ్బాష్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పడూ వీరి సరసన షఫాలీ వర్మ, రాధా యాదవ్ కూడా చేరనున్నారు. బిగ్బాష్లో ఇప్పటికే హర్మన్ప్రీత్, మంధాన ఆకట్టుకున్నారు. ఏడాది చివర్లో మహిళల బిగ్బాష్ లీగ్ జరగనుంది. బీసీసీఐ మహిళల ఐపీఎల్ కూడా ప్లాన్ చేసినా.. కరోనా కారణంగా అది సాధ్యపడలేదు.
భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గురువారం రమేశ్ పొవార్ నియమితుడయ్యాడు. మదన్లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్ సభ్యులుగా ఉన్న బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ ద్వారా పొవార్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. దీంతో డబ్ల్యూవీ రామన్ స్థానంలో పొవార్ ప్రధాన్ కోచ్గా బాధ్యతలు అందుకోనున్నాడు. మహిళల జట్టు చీఫ్ కోచ్ పదవి కోసం మొత్తం 35 మంది పోటీపడ్డారు. ఇందులో పలువురు మాజీ మహిళా క్రికెటర్లతో పాటు చీఫ్ సెలెక్టర్ హేమలత కళ ఉన్నారు.