
పెర్త్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ మోస్తరు స్కోరే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి.. బంగ్లా ముందు 143 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (34, 37 బంతుల్లో; 2×4, 1×6) ఆకట్టుకుంది. బంగ్లా బౌలర్లలో సల్మా ఖాతున్, పన్నా ఘోశ్ చెరో రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత మహిళకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన జ్వరంతో మ్యాచ్కు దూరమవ్వడంతో తానియా భాటియా (2)తో కలిసి షెఫాలీ ఇన్నింగ్స్ను ఆరంభించింది. సల్మా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన భాటియా స్టంపౌటైంది. అయితే షెఫాలీ దూకుడుగా ఆడడంతో భారత్ రన్రేటు తగ్గలేదు. షెఫాలీ బంగ్లాపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ బౌండరీల మోత మోగించింది. మెరుపు వేగంతో ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది.
ధాటిగా ఆడే క్రమంలో పన్నా ఘోశ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన షెఫాలీ.. షమిమా చేతికి చిక్కింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (8) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. అంతేకాదు నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన దీప్తి శర్మ (11)తో కలిసి జెమిమా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. వీరిద్దరు కూడా నిదానంగా ఆడటంతో భారత స్కోరు వేగం తగ్గింది.
జెమిమా పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన రిచా ఘోశ్ (14) కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇన్నింగ్స్ చివరలో పేసర్ శిఖ పాండే (7*)తో కలిసి వేదా కృష్ణమూర్తి (20*, 11 బంతుల్లో; 4×4) బ్యాటు ఝళిపించడంతో.. భారత్ 142 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లో సల్మ (2/25), పన్నా ఘోశ్ (2/25) రాణించారు. ఈ మ్యాచ్ భారత్ సెమీస్ చేరే అవకాశాలు మెరుగవుతాయి. మరి బౌలర్లు ఏం చేస్తారో చూడాలి.