
రోహిత్ రికార్డు బ్రేక్:
ఈ మ్యాచ్లో ముఖ్యంగా షెఫాలీ వర్మ చెలరేగి ఆడింది. 49 బంతుల్లో 73 పరుగులు చేసింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ రికార్డు బద్దలైంది. రోహిత్ 20 సంవత్సరాల 143 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించగా.. షెఫాలీ 15 సంవత్సరాల 285 రోజుల్లోనే ఆ ఘనతను అందుకుంది.

రికార్డు భాగస్వామ్యం:
అయితే ఓవరాల్గా మహిళల అంతర్జాతీయ టీ20ల్లో పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఘనత యూఏఈకి చెందిన ఎగోడాజ్ పేరిట ఉంది. ఆ తర్వాత స్థానాన్ని షెఫాలీ ఆక్రమించారు. ఎగోడాజ్ 15 ఏళ్ల 267 రోజుల వయసులో అర్థ శతకం సాధించింది. మరోవైపు తొలి టీ20లో షెఫాలీతో కలిసి మంధాన 143 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా టీ20ల్లో భారత తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి కొత్త రికార్డు లిఖించారు. 2013లో బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్లో నమోదైన 130 పరుగుల భాగస్వామ్యం రికార్డును మంధాన-షెఫాల్లీలు బ్రేక్ చేశారు. పూనమ్ రౌత్-తిరుష్ కామిని 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

మంధాన, షెఫాలీ మెరుపులు:
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతీ మంధాన, షెఫాలీ వర్మలు తొలి వికెట్కు 143 పరుగులు సాధించారు. ఇన్నింగ్స్ చివర్లో హర్మన్ప్రీత్ (21 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు), వేదా కృష్ణమూర్తి (15 నాటౌట్; 7 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్ జులిపించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

భారత బౌలర్ల హవా:
186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 పరుగులే చేశారు. వికెట్ కీపర్ షీమైన్ క్యాంపబెల్ (33) మినహా ఎవరూ పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో శిఖా పాండే, రాధా యాదవ్, పూనమ్ యాదవ్లు తలో రెండు వికెట్లు సాధించగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్లకు చెరో వికెట్ లభించింది. ఐదు టీ20ల సిరీస్ను భారత్ 1-0తో శుభారంభం చేసింది. షెఫాలీ వర్మకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.


Click it and Unblock the Notifications












