
టీ20లో తొలి అర్ధ శతకం:
యువ సంచలనం షెఫాలీవర్మ టీ20లో తొలి అర్ధ శతకం చేసింది. దీంతో భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లలో అర్ధ శతకం చేసిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డుల్లో ఎక్కింది. ఇక ప్రపంచ క్రికెట్లో ఈ రికార్డు సాధించిన రెండో బ్యాట్స్వుమన్గా నిలిచింది. షెఫాలీ కన్నా ముందు యూఏఈకి చెందిన ఎగొడాగ్ 15 ఏళ్ల 267 రోజుల్లో తొలి టీ20 అర్ధ శతకం బాదింది. షెఫాలి 15 ఏళ్ల 285 రోజుల్లో తొలి టీ20 అర్ధ శతకం చేసింది.

సచిన్ 30 ఏళ్ల రికార్డు బద్దలు:
షెఫాలి వర్మ 15 ఏళ్ల 285 రోజుల్లో తొలి టీ20 అర్ధ శతకం చేసి.. టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 30 సంవత్సరాల రికార్డు బద్దలు కొట్టింది. సచిన్ తన తొలి టెస్ట్ అర్ధ శతకంను 16 సంవత్సరాల 214 రోజులలో సాధించాడు. దీంతో సచిన్ కంటే తక్కువ వయసులోనే షెఫాలి అర్ధ శతకం బాది రికార్డుల్లో ఎక్కింది.

మంధాన, షెఫాలీ మెరుపులు:
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతీ మంధాన, షెఫాలీ వర్మలు తొలి వికెట్కు 143 పరుగులు సాధించారు. భారత్ తరఫున ఇది టీ20ల్లో తొలి వికెట్కు రికార్డు భాగస్వామ్యం. ఇన్నింగ్స్ చివర్లో హర్మన్ప్రీత్ (21 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు), వేదా కృష్ణమూర్తి (15 నాటౌట్; 7 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్ జులిపించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

భారత బౌలర్ల విజృంభణ:
186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 పరుగులే చేశారు. వికెట్ కీపర్ షీమైన్ క్యాంపబెల్ (33) మినహా ఎవరూ పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో శిఖా పాండే, రాధా యాదవ్, పూనమ్ యాదవ్లు తలో రెండు వికెట్లు సాధించగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్లకు చెరో వికెట్ లభించింది. ఐదు టీ20ల సిరీస్ను భారత్ 1-0తో శుభారంభం చేసింది.


Click it and Unblock the Notifications
