ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్-ఏ జట్టు రెండో టెస్టులో పోరాడుతోంది. బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు గొప్పగా పోరాడుతున్నారు. ఆస్ట్రేలియా-ఏ జట్టుకు భారీ ఆధిక్యం తగ్గకుండా కట్టడిచేశారు. 62.1 ఓవరల్లో ఆస్ట్రేలియాను 223 పరుగులకు ఆలౌట్ చేశారు. ప్రసిధ్ కృష్ణ నాలుగు వికెట్లు, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో సత్తాచాటారు. ఆసీస్ జట్టులో మార్కస్ హారిస్ (70) టాప్ స్కోరర్.
అంతకుముందు భారత్-ఏ తొలి ఇన్నింగ్స్లో 161 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (80) గొప్పగా పోరాడాడు. సెకండ్ టాప్ స్కోరర్ దేవదత్ పడిక్కల్ (26). అయితే 11/4తో పీకల్లోతు కష్టాల్లో నిలిచిన జట్టును ధ్రువ్ జురెల్ కాపాడిన తీరుపై ఆస్ట్రేలియా వ్యాఖ్యాతలు ప్రశంసలు జల్లు కురిపించారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో అతన్ని పోల్చారు. ధ్రువ్లో కోహ్లి మేనరిజమ్ ఎంతో ఉందని, అతను మరో కోహ్లి అని కొనియాడారు.

పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్పై ధ్రువ్ జురెల్ పోరాడిన తీరుకు ఆసీస్ వ్యాఖ్యాతలు ముగ్ధులయ్యారు. కసిగా క్రీజులో నిలదొక్కుకున్న తీరు, సహచరులు వెనుదిరుతున్నా స్కోరుబోర్డు ముందుకు నడిపించిన తీరును కొనియాడారు. ఆస్ట్రేలియ బౌలర్ల ముందు స్టార్ ప్లేయర్లు అభిమన్యు ఈశ్వరన్ (0), కేఎల్ రాహుల్ (4), సాయి సుదర్శన్ (0), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (4) నిలవలేకపోయినా జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
కాగా, ఈ ఏడాది ఆరంభంలో కేఎస్ భరత్ విఫలమవ్వడంతో ఇంగ్లండ్ సిరీస్లో టీమిండియాలో ధ్రువ్ జురెల్ చోటు సంపాదించాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిలకడగా పరుగులు సాధించాడు. కానీ రిషభ్ పంత్ పునరాగమనంతో ధ్రువ్ జురెల్ బెంచ్కే పరిమితమయ్యాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లకు ఎంపికైనప్పటికీ తుదిజట్టులో అవకాశం దక్కలేదు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన ధ్రువ్ను టీమిండియాతో కంటే ముందుగానే ఆస్ట్రేలియాకు బీసీసీఐ పంపింది. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేలా సాధన చేయాలని కేఎల్ రాహుల్తో పాటు ధ్రువ్కు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.