హిట్టర్లతో బలంగా ముంబై:
2010 ఐపీఎల్ సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా (57 నాటౌట్: 35 బంతుల్లో 3x4, 3x6) హాఫ్ సెంచరీ చేసాడు. హిట్టర్లతో బలంగా కనిపించిన ముంబై స్వల్ప ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేస్తుందని అంతా ఊహించారు. మరోవైపు అప్పటి ముంబై కెప్టెన్ సచిన్ టెండూల్కర్ మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఓ వ్యూహం ప్రకారం సచిన్ని బోల్తా కొట్టించి కప్ గెలిచాం అని ఎడమచేతి వాటం స్పిన్నర్ షదాబ్ జకాతి తాజాగా తెలిపాడు.
ధోనీ వ్యూహం నాకు అర్థం కాలేదు:
తాజాగా విస్డెన్ ఇండియాతో షదాబ్ జకాతి మాట్లాడుతూ... 'ఫైనల్ మ్యాచ్లో నేను వేసిన మొదటి రెండు ఓవర్లలోనే 21 పరుగులు ఇచ్చాను. మూడో ఓవర్ బౌలింగ్ చేసే ముందు కెప్టెన్ ధోనీ నా వద్దకు వచ్చి.. ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ అభిషేక్ నాయర్ బ్యాటింగ్ చేస్తున్నాడు, నువ్ మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేద్డువులే అని చెప్పాడు. అప్పట్లో ధోనీ వ్యూహం నాకు అర్థం కాలేదు. నన్ను కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ కోసం ఉంచాడని సచిన్ టెండూల్కర్ వికెట్ పడిన తర్వాత అర్ధమయింది' అని తెలిపాడు.
సచిన్ ఔట్ అయ్యాక తెలిసింది:
ముంబై జట్టులోని కుడిచేతి వాటం బ్యాట్స్మెన్లు సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు, కీరన్ పొలార్డ్ల కోసం ఆ మ్యాచ్లో ధోనీ నన్ను పక్కనపెట్టాడు. ఆ ముగ్గురూ అప్పట్లో ఎడమచేతివాటం స్పిన్నర్లని ఎదుర్కోవడంలో కొంచెం బలహీనంగా కనిపించారు. అందుకే నన్ను మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయించాడు మహీ. ఈ విషయం నాకు సచిన్ ఔట్ అయ్యాక కానీ తెలియరాలేదు. ధోనీ వ్యూహం చెన్నైకి కప్పును తెచ్చింది' అని షదాబ్ జకాతి చెప్పాడు.
దూకుడుగా ఆడిన సచిన్:
స్వల్ప లక్ష ఛేదనలో ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సచిన్ టెండూల్కర్ (48: 45 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. దూకుడుగా ఆడుతూ ముంబైన విజయం దిశగా తీసుకెళ్లాడు. ఈ దశలో జకాతిని బౌలింగ్కి దింపిన ధోనీ.. అతడ్ని పెవిలియన్ చేర్చాడు. అనంతరం ముంబై 9 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసింది. దీంతో చెన్నై 22 పరుగుల తేడాతో గెలిచి.. తొలిసారి ఐపీఎల్ టైటిల్ని ముద్దాడింది. ఆపై ధోనీ తన అద్భుత కెప్టెన్సీతో మరో రెండు టైటిల్స్ అందించాడు.