కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లను కరోనా వైరస్ గండం వీడలేదు. కొద్ది రోజుల క్రితం షాహిద్ ఆఫ్రిదీకి కరోనా వైరస్ సోకగా... మళ్లీ మరో ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనావైరస్ సోకిన వార్తలు ఆందోళన కలిగించాయి. పాక్ క్రికెటర్లు షాదాబ్ ఖాన్, హరీష్ రవూఫ్, హైదర్ అలీలు మహమ్మారి బారిన పడినట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ ఘటన మరువక ముందే మరో ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు పీసీబీ వెల్లడించింది.
పాకిస్తాన్ క్రికెటర్లు మొహ్మద్ హఫీజ్, వాహబ్ రియాజ్లకు కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. కీలకమైన ఇంగ్లండ్ పర్యటనకు ముందు వీరికి రోనా సోకింది. దీంతో మొత్తం 10 మంది క్రికెటర్లకు కరోనావైరస్ సోకినట్లు పీసీబీ నిర్థారించింది. ఇక కరోనావైరస్ సోకిన ఇతర క్రికెటర్లలో కాషిఫ్ భట్టి, మొమ్మద్ హస్నేన్, ఫకర్ జమాన్, మొహ్మద్ రిజ్వాన్, ఇమ్రాన్ ఖాన్లకు కూడా కరోనా సోకినట్లు పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. 10 మంది యువ క్రికెటర్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోందని పాక్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా ఫలానా వారికే సోకుతుందనేది ఏమీ లేదని ఎవరికైనా సోకే అవకాశముందని పాక్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీం ఖాన్ చెప్పారు. ఇక సపోర్ట్ స్టాఫ్కు కూడా కరోనా పాజిటివ్ సోకిందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే క్రికెటర్లు, ఇతర సిబ్బంది అంతా లాహోర్లో ఉంటారని జూన్ 25వ తేదీన మరోసారి కరోనావైరస్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే కొత్త జట్టును ప్రకటిస్తామని వెల్లడించారు. జూన్ 28వ తేదీన పాక్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు బయలు దేరి వెళ్లాల్సి ఉంది. వచ్చె నెల నుంచి ఇంగ్లాడ్ పాకిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోను ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత ఆటగాళ్లకు మరోసారి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.